
భూ ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
వనపర్తి రూరల్: రైతుల నుంచి స్వీకరించిన భూ ఫిర్యాదులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం పెబ్బేరు మండలం వై శాఖాపూర్లో జరిగిన రెవెన్యూ సదస్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సులపై గ్రామంలో ఒక రోజు ముందుగానే చాటింపు వేయించాలని ఆదేశించా రు. నిర్ణీత నమూనాలోనే దరఖాస్తు చేసుకోవాలని, ఫారాలు నింపేందుకు రెవెన్యూ సిబ్భందిని నియమించినట్లు తెలిపారు. నోటీసులు ఇవ్వాల్సిన వాటికి వెంటనే జారీచేసి గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం కంచిరావుపల్లిలోని రైతువేదికలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలోని మహేశ్వర ట్రేడర్స్ దుకాణాన్ని తనిఖీచేసి లైసెన్స్, స్టాక్ రిజిస్టర్, విత్తనాలను పరిశీలించారు. అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకొని రైతులకు ఇబ్బందులు కలగకుండా సరఫరా చేయాలని సూచించారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, డీటీ నందకిషోర్, ఆర్ఐ రాఘవేందరావు, ఏఓ షేక్ మున్నా పాల్గొన్నారు.