
ఆగుతూ.. సాగుతూ!
జిల్లాలో నత్తనడకన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు
వివరాలు 8లో u
●
బేస్మెంట్ నిర్మించినా
బిల్లు రాలే..
అధికారులు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం ఇచ్చారు. దీంతో అప్ప చేసి బేస్మెంట్ వరకు నిర్మించినా ఇప్పటి వరకు రూ.లక్ష ఇవ్వలేదు. కారణం ఏమిటంటే బ్యాంకు ఖాతాలో తేడాలున్నాయని అధికారులు చెబుతున్నారు. త్వరగా బిల్లు చెల్లించి ఆదుకోవాలి.
– అంజమ్మ, చింతరెడ్డిపల్లి (అమరచింత)
అప్పు చేసి నిర్మాణం..
బిల్లు త్వరగా వస్తుందని రూ.50 వేలు అప్పుచేసి బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం చేపట్టా. ఇప్పటి వరకు బిల్లు రాకపోవడంతో పనులు నిలిపివేశా. మండలంలోని యూనియన్ బ్యాంకులో ఖాతా తెరవమన్నారు.. ఇప్పటి వరకు బిల్లు మాత్రం రాలేదు. ఎంపీడీఓతో పాటు అధికారులు వచ్చి పనులు చేపట్టాలని బిల్లు వస్తుందని భరోసానిస్తున్నారు. మొదటి బిల్లు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తా.
– వై.అనిత, చింతరెడ్డిపల్లి (అమరచింత)
రెండో బిల్లు వచ్చింది..
అధికారుల సూచనతో ఇంటి నిర్మాణం చేపట్టా. ఆత్మకూర్ ఎస్బీఐ బ్యాంకు ఖాతా ఇచ్చా. ఇప్పటి వరకు రెండు విడతలుగా రూ.రెండు లక్షల బిల్లు వచ్చింది. ప్రస్తుతం స్లాబ్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఇంటి పనులు పూర్తి చేసుకుంటే పూర్తి బిల్లు వస్తుందని అధికారులు చెబుతున్నారు.
– వెంకటన్నగౌడ్,
చింతరెడ్డిపల్లి (అమరచింత)
అవగాహన కల్పిస్తున్నాం..
జిల్లాలో మొదటి విడత మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచడానికి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 499 మంది లబ్ధిదారులు బేస్మెంట్ వరకు నిర్మాణాలు పూర్తిచేశారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన వారి బ్యాంకు ఖాతాల్లో రూ.లక్ష జమ చేశాం. మిగిలిన లబ్ధిదారులతో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. బ్యాంకు ఖాతాల్లో లోపాలు గుర్తించి సవరిస్తూ బిల్లులు అందిస్తున్నాం.
– విఠోభా, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్
అమరచింత: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. పథక ప్రారంభంలో జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఎంపిక చేసి పేదలను గుర్తించి జనవరి 26న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు. ఇంటి నిర్మాణంలో పాటించాల్సిన విధి విధానాలను గ్రామసభల ద్వారా అధికారులు తెలియజేశారు. కాని అధికారుల గైడ్లెన్స్ ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టలేమంటూ లబ్ధిదారులు నిర్మాణాలకు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి లబ్ధిదారుల్లో చైతన్యం తీసుకొచ్చి పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఒక గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఎంపిక చేశారు. మొత్తం 14 గ్రామాల్లో 1,131 మంది లబ్ధిదారులను గుర్తించి ఇంటి నిర్మాణ పత్రాలు అందించారు. వీటిలో ఇప్పటి వరకు 499 బేస్మెంట్ లేవల్కు, 54 రూఫ్ లేవల్కు, కేవలం 10 ఇళ్లు మాత్రమే స్లాబ్ లేవల్కు వచ్చినట్లు హౌసింగ్ అధికారులు చెబుతున్నారు.
బ్యాంకు ఖాతాల సమస్య..
లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సమస్యలు తలెత్తడంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. జాతీయ బ్యాంకుల్లో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు హౌసింగ్శాఖ విడతల వారీగా చెల్లిస్తున్నారు. కాని ఇప్పటి వరకు యూనియన్ బ్యాంకులో మాత్రమే ఇలాంటి సమస్య తలెత్తిందని.. గుర్తించి పరిష్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అవగాహన కల్పిస్తూ..
ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవడం సాధ్యం కాదంటూ లబ్ధిదారులు మండల పర్యటనకు వచ్చిన అధికారులకు ఇంటి మంజూరు పత్రాలను వెనక్కి ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో అధికారులు వారానికోమారు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి త్వరగా బెస్మెంట్ నిర్మిస్తే రూ.లక్ష మంజూరు చేస్తామని, అధైర్యపడొద్దని భరోసానిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
బిల్లుల చెల్లింపులు..
మొదటి బిల్లు రూ.లక్ష బేస్మెంట్ నిర్మించిన తర్వాత లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. రెండోబిల్లు రూ.లక్ష గోడలు నిర్మించిన తర్వాత, మూడో బిల్లు రూ.రెండు లక్షలు స్లాబ్ వేసిన తర్వాత, చివరి బిల్లు రూ.లక్ష మరుగుదొడ్డి, ఇంటి పనులు పూర్తి చేసిన తర్వాత చెల్లిస్తారు.
పైలెట్ గ్రామంగా మండలానికి
ఒకటి ఎంపిక
14 గ్రామాలు.. 1,131 మంది లబ్ధిదారులు
స్లాబ్ వరకు చేరినవి కేవలం
10 మాత్రమే..
బేస్మెంట్ లేవల్కు వచ్చినవి 499
అడ్డంకిగా మారిన నిబంధనలు..
మంజూరు పత్రం అందుకున్న 45 రోజుల్లో పనులు ప్రారంభించాలి.
ఇంటి నిర్మాణం 400 X 600 విస్తీర్ణం మించకుండా, ఆర్సీసీతో నిర్మించుకోవాలి. రెండు గదులతో పాటు వంట గది, మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలి.
అనర్హులుగా తేలినా, నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మించినట్లు తెలిసినా ఇంటి మంజూరును రద్దు చేస్తూ అప్పటి వరకు చెల్లించిన బిల్లును ఆర్ఆర్ చట్టం ప్రకారం తిరిగి వసూలు చేయబడును.

ఆగుతూ.. సాగుతూ!

ఆగుతూ.. సాగుతూ!

ఆగుతూ.. సాగుతూ!

ఆగుతూ.. సాగుతూ!

ఆగుతూ.. సాగుతూ!