
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
వనపర్తి విద్యావిభాగం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని.. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చేర్పించి వారి భవిష్యత్కు బంగారు బాటలు వేయాలని జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజేషన్ కో–ఆర్డినేటర్ యుగంధర్ కోరారు. గురువారం ఆత్మకూర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాల, జూరాలలోని ఉన్నత, జెడ్పీ బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేసి మాట్లాడారు. ప్రభుత్వ బడులను కాపాడుకునే బాధ్యత గ్రామంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా బాలికలు భవిష్యత్లో ఎట్టి పరిస్థితుల్లో విద్యాభ్యాసం ఆపకుండా లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహించాలన్నారు. బడిబాటలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా.. పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు స్వాగతం పలికేందుకు భవనాలను మామిడాకుల తోరణాలు, పూలమాలలతో అలంకరించడంతో పాటు డప్పుచప్పుళ్లతో ఆహ్వానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.