
రైతులకు పారదర్శక సేవలు
ఖిల్లాఘనపురం: రైతులకు పారదర్శకమైన సేవలు అందించే బాధ్యత అధికారులపై ఉందని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండలంలోని షాపురం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సదస్సుల్లో అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తూ దరఖాస్తులకు సంబంధించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. తప్పుడు ఎంట్రీలకు నోటీసులు జారీ చేయాలని.. హెల్ప్డెస్క్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది రైతులకు పూర్తి సమాచారం అందించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కోరారు.
రైస్మిల్లు తనిఖీ..
గురువారం మండలానికి వచ్చిన రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మండల కేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వర రైస్మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. మిల్లుకు వచ్చిన ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలని యజమానిని ఆదేశించారు. దించుకున్న ధాన్యం ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలని.. సీఎంఆర్ కోసం మిల్లింగ్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలన్నారు. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు, మిల్లర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ సుగుణ, సీనియర్ అసిస్టెంట్ కురుమూర్తి, ఆర్ఐ తిరుపతయ్య, పలువురు సిబ్బంది ఉన్నారు.