
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
పాన్గల్: రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర గురువారం మండలంలోని తెల్లరాళ్లపల్లి, కేతేపల్లి, జమ్మాపూర్లో కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ వారసత్వం, డా. బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా జై సంవిధాన్ యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. కూడు, గూడు, గుడ్డ ప్రతి ఒక్కరికి అందించాలనేదే గాంధీజీ ఆలోచన అని.. ఆయన ఆశయ సాధనకు ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని తెలిపారు. గాంధీజీ, అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందన్నారు. కాంగ్రెస్పార్టీ అధికారంలో ఉన్న 70 ఏళ్లలో భారత రాజ్యాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రక్షించిందని.. నేడు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను విడతల వారీగా అమలు చేస్తున్నామని.. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందుతాయన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి నెల రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని.. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
ధాన్యం తరుగుపై ఆరా..
మిల్లర్లు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయంపై మంత్రి జూపల్లి పౌరసరఫరాల డీఎం జగన్మోహన్, ఆర్డీఓ సుబ్రమణ్యంతో ఆరా తీశారు. ఈ విషయంపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.