
‘నీలి’నీడలు
మత్స్యకారులకు ఉచితంగా చేప విత్తనాలు ఆర్థిక భరోసా అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఏటా రూ.కోట్లు వెచ్చించి.. చేప విత్తనాలు అందిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఇది పెద్దగా సత్ఫలితాలు సాధించలేకపోతోంది. దీనికోసం ఉమ్మడి పాలమూరులో ఇప్పటికే అందుబాటులో ఉన్న చేప విత్తనాల ఉత్పత్తి కేంద్రాలకు కొద్దిపాటి నిధులు వెచ్చించి.. వాటిని వినియోగంలోకి తెస్తే ప్రభుత్వం ఆశించిన నీలి విప్లవం సృష్టించవచ్చు. వీటిని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు ‘మీన’మేషాలు లెక్కిస్తున్నారు.
జిల్లాల వారీగా ఇలా..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరుపయోగంగా చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు
● కొత్త కేంద్రాల ఏర్పాటుపైనా అధికారుల నిర్లక్ష్య వైఖరి
● పుష్కలంగా నీటి వనరులున్నా నిష్ప్రయోజనం
● క్షేత్రస్థాయిలో సమస్యలపై దృష్టి సారించని ప్రభుత్వం
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా
నష్టపోతున్న మత్స్యకారులు
మహబూబ్నగర్ న్యూటౌన్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిఏటా జిల్లాల వారీగా కోట్లలో చేప విత్తనాలు అవసరమవుతాయి. జిల్లాల వారీగా చేప పిల్లల ఉత్పత్తి జరిగితే వాటిని మత్స్యకారులకు పంపిణీ చేసి పారదర్శకంగా మత్స్య పారిశ్రామిక రంగం వృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఉచిత చేపపిల్లల పంపిణీకి ఉత్పత్తి లేకపోవడంతో మత్స్యకారులకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. మత్స్య సంపద పెంపునకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ప్రతి సంవత్సరం టెండర్లు నిర్వహించి ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి చేప విత్తనాలను తెస్తే నాణ్యత లేకపోవడంతో మత్స్యకారులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో నదులు, జలాశయాలు, చెరువులు, కుంటలు మత్స్యకారులకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో 4,624 చెరువులు, కుంటలు, జలాశయాల్లో ప్రతి ఏడాది 11.07 కోట్ల చేపపిల్లల పెంపకం లక్ష్యంగా ఉంది. చేపపిల్లల పంపిణీ కోసం ఏటా రూ.9 కోట్లు వెచ్చిస్తున్నారు. చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గడంతో పాటు మత్స్యకారులకు నాణ్యమైన చేప విత్తనాలు లభించడంతోపాటు అక్రమాలకు ఆస్కారం ఉండదు.
పిల్లలమర్రిలో నిరుపయోగంగా ఉన్న
చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం
‘మీన’మేషాలు

‘నీలి’నీడలు