
ఉమ్మడి జిల్లాలో పాడి పశువులు, పాల ఉత్పత్తి ఇలా..
గద్వాలలోని ఓ డెయిరీ ఫాంలో పాలు పితుకుతున్న రైతు
పాల ఉత్పత్తికి పెట్టింది పేరు పాలమూరు. జిల్లాలో పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతుంది. ప్రతినిత్యం వేలాది మంది రైతులు పాలు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. జిల్లాలో సుమారు 10 వేల మంది పాడి రైతులు ఉన్నారు. కాగా.. విజయ డెయిరీ మిల్క్ చిల్లింగ్ సెంటర్లు 224 ఉండగా, ప్రతిరోజు 36,157.5 లీటర్ల పాలు సేకరిస్తున్నామని డెయిరీ డెవలప్మెంట్ అధికారులు తెలిపారు. ఈ డెయిరీ పరిధిలో మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో పాల సేకరణ జరుగుతుంది. డెయిరీతోపాటు మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, బల్క్ కూలింగ్ యూనిట్లు మొత్తం 6 ఉన్నాయి. పాడి రైతుల కోరిక మేరకు ప్రైవేట్ డెయిరీల కంటే అధిక పాల సేకరణ ధర లీటరు గేదె పాలకు అధికంగా 10 శాతం వెన్న, 9 శాతం గణ పదార్థాలకు రూ.84.50, ఆవు పాలకు 4.9 వెన్న శాతానికి 8.9 ఘన పదార్థాలకు రూ.42.57 చెల్లిస్తున్నారు.
యువత సైతం మక్కువ..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే వ్యవసాయంతోపాటు, కరువు కాటకాలు వచ్చినప్పుడు కుటుంబ పోషణ భారం కాకుండా ఇక్కడి రైతులు పాడిపై దృష్టిసారిస్తూ వచ్చారు. ఆవులు, గేదెల ద్వారా వచ్చిన పాలను విక్రరు ుస్తూ జీవనం సాగించడంతోపాటు ఆర్థికంగా నిలదొక్కు కుంటున్నారు. గడిచిన ఐదేళ్ల నుంచి చాలామంది నిరుద్యోగ యువత పాడిపై మక్కువ పెంచుకున్నారు. డెయిరీ ఫాంల ఏర్పాటుతో స్వయం ఉపాధి కల్పించుకొని ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు.
పాడి రైతులపై ఆర్థిక భారం
ఒకప్పుడు రాష్ట్రానికి రోజువారీగా అవసరమైన పాలు ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉత్పత్తి అయ్యేవి అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో. అయితే ప్రస్తుతం పాడి పరిశ్రమ ఒడుదొడుకులను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మూడుసార్లు ఆవు పాల ధర తగ్గించింది. ఇప్పటికే పాడి రైతులు పశుపోషణ భారమై తమ ఆవులు, గేదెలను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పరంగా విజయ డెయిరీ ద్వారా ఇస్తున్న దాణా, మినరల్ మిక్చర్, క్యాల్షియం మందులు సబ్సిడీలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రైతులు ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. కాల్షియం మందులు, విజయ దాణా కొనుగోలు చేయాలంటే సబ్సిడీ కాకుండా పూర్తి ధర చెల్లించాల్సి వస్తుందని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పాడి రైతుల సంక్షేమం కోసం డెయిరీ పరంగా అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అవి రైతులకు భరోసా కల్పించడం లేదు. ఉచిత పశువైద్య శిబిరాల నిర్వహణ, పాడి రైతులకు డీబీటీ సదుపాయంతోపాటు ప్రతి 15 రోజులకు ఒకసారి పాల బిల్లులు సక్రమంగా అందడం లేదు. దీంతో రైతులు ప్రైవేటు సెంటర్లలో విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
నాగర్కర్నూల్లో 9 కేంద్రాలు ..
నాగర్కర్నూల్ జిల్లాలో ప్రస్తుతం 9 కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉండగా జిల్లావ్యాప్తంగా 220 అవుట్ లెట్ల ద్వారా పాలు సేకరిస్తున్నారు. అయితే ప్రతిరోజు 1.70 లక్షల లీటర్లకు పైగా పాల ఉత్పత్తి జరుగుతున్నా కేంద్రాల ద్వారా దాదాపు 10 వేల మంది రైతుల నుంచి 74 వేల లీటర్ల పాలు మాత్రమే సేకరిస్తున్నారు.
జిల్లా గేదెలు ఆవులు ప్రతిరోజు
పాల ఉత్పత్తి
మహబూబ్నగర్ 50,000 80,000 36,157
నాగర్కర్నూల్ 1,20,800 80,500 1,70,225
వనపర్తి 22,955 9,774 35,677
జోగుళాంబ గద్వాల 49,659 47,902 40,000
నారాయణపేట 24,000 35,000 27,300
వనపర్తిలో ప్రైవేట్ వైపే..
జిల్లాలో ప్రతిరోజు 53,677 లీటర్ల పాల ఉత్పత్తి అవుతోంది. అయితే పాడిరైతులు రోజువారిగా ఉత్పత్తి చేసిన పాలను 95 శాతం గృహ అవసరాలు, ప్రైవేటు డెయిరీలకు వెళ్తుంటే.. కేవలం 5 శాతం మాత్రమే ప్రభుత్వం అనుబంధంగా నిర్వహిస్తున్న విజయ డెయిరీకి పోస్తున్నారు. విజయ డెయిరీకి పాలు పోస్తున్న రైతుల సంఖ్య కేవలం 343 మంది మాత్రమే ఉండటం గమనార్హం.
1975లోనే పాలకేంద్రం
గద్వాల ప్రాంతంలో 1975లో ప్రభుత్వం పాలకేంద్రం స్థాపించింది. చాలా ఏళ్లపాటు రైతులు ఇక్కడ పాలు విక్రయించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు, అధికారుల నిర్లక్ష్యం మూలంగా పాల కేంద్రం మూతబడింది. కాగా 2020 ప్రాంతంలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో 5 వేల లీటర్ల సామర్థ్యంతో పాలకేంద్రం పునఃప్రారంభమైంది. దీనిద్వారా జిల్లావ్యాప్తంగా 25 పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి.. ప్రతిరోజు 2,500 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. ఇవి కాకుండా ప్రైవేట్ పరంగా మరో పది దాక పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి.
నారాయణపేట జిల్లాలో..
జిల్లాలో 280 గ్రామాలతోపాటు పెద్దఎత్తున తండాలు ఉండటం వల్ల గ్రామీణ జనాభా ఎక్కువగా ఉండటంతో పాడి పశువుల పోషణే ప్రధాన జీవనోపాధిగా మారింది. జిల్లావ్యాప్తంగా 500 మిల్క్ సెంటర్లు ఉండగా ప్రైవేటు వారు 30 వేల లీటర్లు, విజయ డెయిరీ నుంచి 2,500 లీటర్ల పాలను సేకరిస్తున్నారు.