
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
వనపర్తి రూరల్: జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని నాగవరం రైతువేదికలో ప్రొ. జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ, మండల వ్యవసాయశాఖ సంయుక్తంగా రైతు అవగాహన సదస్సు నిర్వహించగా ఆయనతో పాటు శాస్త్రవేత్త డా. భరత్భూషణ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు మెళకువలు పాటించి నాణ్యమైన విత్తనాలు వినియోగించి వచ్చే సీజన్లో మిగతా రైతులకు అందించాలని కోరారు. వరి (కేఎన్ఎం–1638), జొన్న 28 మినీ కిట్ల విత్తనాలను మండలంలోని ఒక్కో గ్రామ రైతులకు 3 ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఓ కురుమ య్య, న్యాయ సలహాదారు ఉత్తరయ్య, ఏఈఓలు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
మహిళల సమస్యల పరిష్కారానికి పోరాటం
పాన్గల్: మహిళల సమస్యల పరిష్కారానికి వారితో కలిసి పోరాటాలు కొనసాగిస్తామని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల అన్నారు. మంగళవారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో సంఘం సభ్యులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని.. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో మహిళల సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి పోరాటాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెలల్లో ఐద్వా ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో సంఘం నాయకురాలు అనిత, సభ్యులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు