
నిర్వాసితులకు న్యాయం చేస్తాం
వనపర్తి: పట్టణాభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవరసరమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని 22, 23 వార్డుల్లో మార్నింగ్ వాక్ చేసి ఆయా వార్డుల ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ పాలనలో రహదారి విస్తరణకు అంకురార్పణ చేశారని.. ఎన్నో హామీలు గుప్పించి అడుగడుగునా మోసం చేశారని, ఇప్పటికై నా తమకు న్యాయం చేయాలని గోడు వెల్లబోసుకున్నారు. కొందరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారని, అవి వినియోగానికి అనుకూలంగా లేవని సరిచేసి ఇవ్వాలని కోరారు. వృద్ధులైన తమకు రెండు, మూడు అంతస్తుల్లో ఇళ్లు కేటాయిస్తే వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాన్గల్ రోడ్ రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేసి న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. ఏ ఒక్కరూ నష్టపోకుండా తగిన పరిహారం అందజేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్, సిబ్బంది ఉండి బాధితుల జాబితాను తయారు చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పి.మహేష్, మాజీ కౌన్సిలర్ చీర్ల సత్యం, అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు.