
సీఎంఆర్ అప్పగిస్తేనే ధాన్యం కేటాయింపు
వనపర్తి: డిఫాల్ట్ మిల్లర్లు బకాయి ఉన్న సీఎంఆర్ అప్పగించి నిజాయతీగా ముందుకొస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ధాన్యం కేటాయింపులు చేపడతామని పౌరసరఫరాలశాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్ చౌహాన్ తెలిపారు. మంగళవారం జిల్లాలో పర్యటించిన అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లుతో కలిసి వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల పౌరసరఫరాలశాఖ అఽధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన ధాన్యం మిల్లులకు అప్పగిస్తే పద్ధతి ప్రకారం నిల్వ చేయకుండా బయట గుట్టలుగా పడేసి తడిసిపోయిందని, సీఎంఆర్ ఇవ్వమని చెప్పడం క్షమార్హం కాదని, ప్రభుత్వం కేటాయించిన ధాన్యం తీసుకోకుండా ప్రైవేట్గా వడ్లు తీసుకొని మిల్లింగ్ చేసే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. రెండు జిల్లాల్లో సగానికిపైగా మిల్లర్లు డిఫాల్ట్ జాబితాలో ఉండటం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలో ఎక్కడా లేని సమస్యలు ఇక్కడే ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని ప్రశ్నించారు. తాత్కాలికంగా గోదాముల్లో ధాన్యం నిల్వ చేసినప్పటికీ అంతిమంగా తిరిగి మిల్లులకు చేరాల్సిందేనని స్పష్టం చేశారు. మిల్లర్ల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యం మిల్లుకు రాకపోవడంతో క్వింటాకు 67 కిలోలు రావాల్సిన బియ్యం 62 కిలోలే వస్తున్నాయని, తద్వారా మిల్లర్లు నష్టపోతున్నారని వివరించారు. ఎఫ్ఏక్యూ ప్రకారం ధాన్యం రావడం లేదని చెప్పడం సరికాదని, తేమ శాతం వచ్చాకే తూకం చేసి మిల్లులకు పంపిస్తున్నామన్నారు. వరి కోత యంత్రాలు 18 నుంచి 20 ఆర్పీఎం, గేర్ స్నాట్ బి–1లో ఉంచడం, బ్లోయర్ ఆన్లో పెట్టుకొని పంట కోతలు చేపట్టేలా చూడాలని, నిబంధనలు పాటించని యజమానులపై కేసులు నమోదు చేయాలని పోలీస్శాఖను ఆదేశించారు. వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. పదేళ్లలో ఏ యాసంగిలో రానంత దిగుబడి ఈసారి జిల్లాలో పండిందని తెలిపారు. ఇప్పటి వరకు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.571 కోట్లు 39,145 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. మరో 20 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందని తెలిపారు. జిల్లాలో 184 మిల్లులు ఉండగా.. డిఫాల్ట్ మిల్లులుపోను కేవలం 77 మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించినట్లు వివరించారు. సమావేశంలో నాగర్కర్నూల్ అదనపు కలెక్టర్ అమరేందర్, వనపర్తి డీఎస్ఓ కాశీవిశ్వనాథ్, డీఎంలు, ఆయా ప్రాంతాల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.
ప్రైవేట్ వడ్లు మిల్లింగ్ చేస్తే చర్యలు
పౌర సరఫరాలశాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్ చౌహాన్