
పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి
వనపర్తిటౌన్: చెడు వ్యసనాలతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని.. దూరంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కోరారు. ప్రపంచ పొగాకు రహిత దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పొగాకు ఉత్పత్తులు దరి చేరకుండా సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ధూమపానం చేయమని.. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటామని.. కుటుంబ సభ్యులు, స్నేహితులను పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండేలా చూస్తామంటూ న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ న్యా యమూర్తి జి.కళార్చన, జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.శ్రీలత కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
14న జాతీయ లోక్ అదాలత్..
కోర్టు తీర్పుతో కక్షిదారుడు ఒక్కరే విజయం సాధిస్తే.. లోక్ అదాలత్లో రాజీ కావడంతో ఇరువురు విజయం సాధించినట్లేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 14వ తేదీన జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీకి అనుకూలమైన సివిల్, క్రిమినల్ తదితర కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. జాతీయ లోక్ అదాలత్తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని.. తీర్పులకు అప్పీలు ఉండదని తెలిపారు.