
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
వనపర్తి: మన చుట్టూ ఉండే పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎకో పార్క్ వద్ద శ్రమదానం చేసి మొక్కలు నాటారు. అంతకు ముందు అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. అధునాతన విజ్ఞానం విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో మనిషి తన మనుగడ కోసం విచ్చలవిడిగా యంత్రాలను వినియోగిస్తున్నారన్నారు. అలాగే కర్మాగారాలు, ఫ్యాక్టరీలు, వాహనాల వల్ల విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుందని, ఇందుకోసం మొక్కలు నాటడం, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ యాదయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఇంటి పరిసర ప్రాంతాల్లో కనీసం మూడు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ప్రభుత్వ సేవకులపై ఎల్లప్పుడూ ఆధారపడకుండా తమ వీధులను తాము శుభ్రపరుచుకునేలా నెలలో ఒకరోజు శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అటవీ శాఖాధికారి నిఖిల్రెడ్డి మాట్లాడుతూ జిల్లా సస్యశ్యామలంగా ఉండాలంటే ప్రధానంగా నీటి వనరుల కోసం భూగర్భ జలాలను పెంచుకోవాలన్నారు. అందుకు చెట్లను పెంచడమే అసలైన మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీఐ కృష్ణయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, అప్పలనాయుడు, నిస్వార్థ ఆర్గనైజేషన్ సభ్యులు, స్నేక్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.