
మానవ అక్రమ రవాణాను నిర్మూలించాలి
వనపర్తి విద్యావిభాగం: మనుషుల అక్రమ రవాణా నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని డీఈఓ అబ్దుల్ ఘనీ అన్నారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సంస్థ ఆధ్వర్యంలో గురువారం కేజీబీవీలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచం వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరితమైన చర్య అన్నారు. దీనికి పేద, మధ్య తరగతి అమ్మాయిలు, మహిళలు ఎక్కువగా గురవుతున్నారన్నారు. సమాజంలో ప్రజలతో, విద్యార్థులతో సన్నిహితంగా ఉండి గమనించి వారికి అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సైబర్ ట్రాఫికింగ్ అనేది చాలా వేగంగా విస్తరిస్తున్న జటిలమైన సమస్య కాబట్టి పిల్లలకు ఫోన్ ఉపయోగించడం ద్వారా వచ్చే నష్టాలను తెలియజేయాలన్నారు. సమాజంలో ఉన్న చాలా సమస్యలకు ఆర్థిక కారణాలతోపాటు సామాజిక కారణాలు దోహదం చేస్తాయని, మన చుట్టుపక్కల ఉండే ఇలాంటి వారిని ట్రాఫికెర్స్ టార్గెట్ చేసి, మాయమాటలు, ఉద్యోగం, సినిమా అవకాశం అంటూ మోసం చేస్తారన్నారు. అనంతరం ప్రజ్వల సీనియర్ కోఆర్డినేటర్ మల్లేష్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకుంటే మన ఆడపిల్లలను రక్షించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జీసీడీఓ శుభలక్ష్మి, ఏఎంఓ మహానంది, సీఎంఓ యుగంధర్, ప్రజ్వల అసిస్టెంట్ కోఆర్డినేటర్ మిథాలీరాజ్ పాల్గొన్నారు.