
ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలి
వనపర్తి: జిల్లాలో కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని 5 రోజుల్లో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మధ్యాహ్నం అదనపు కలెక్టర్ తన చాంబర్లో వరి కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, గోపాల్పేట మండలాల్లో దాదాపు 10 నుంచి 12 వేల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయాల్సి ఉందని, వాటిని వారం రోజుల్లో కొనుగోలు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలు మూసివేయాలని సూచించారు. రోజుకు 3 వేల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని, కొనుగోలు కేంద్రాల్లో వడ్లు ఆరబెట్టి తూకం త్వరగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2.57 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు (95 శాతం) కొనుగోలు పూర్తి చేశామని, మిగిలిన 5 శాతాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అలాగే వరకు 42 వేల మంది రైతుల నుంచి రూ.600 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి రూ.458 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. మిగిలిన రూ.130 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఆన్లైన్ ఎంట్రీలు వేగవంతం చేయాలని కో ఆపరేటివ్, డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఏఓ గోవింద్నాయక్, సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, డీఎం జగన్మోహన్, కోపరేటివ్ అధికారి రాణి, డీపీఎం అరుణ, రవాణా శాఖాధికారి మానస తదితరులు పాల్గొన్నారు.