
రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయాలి
వనపర్తి: జిల్లాకేంద్రం నుంచి వెళ్లే పాన్గల్, పెబ్బేరు రోడ్డు విస్తరణ పనులు వేగంగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో రోడ్డు విస్తరణ పనులపై సమీక్ష నిర్వహించారు. పాన్గల్ రోడ్డుకు సంబంధించి మొత్తం ఎంత మంది స్థలాలు కోల్పోతున్నారు.. వారికి ఇప్పటి వరకు అందజేసిన పరిహారంపై వివరాలు తెలుసుకున్నారు. పెబ్బేరు రోడ్డుపై మాట్లాడుతూ 80 ఫీట్ల రోడ్డుకు కొలతలు తీసుకోవాలని, స్థలం కోల్పోతున్న వారికి టీడీఆర్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండో దఫా నోటీసులు జారీ చేసి పనులు త్వరగా ప్రారంభించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణంలో ఇప్పటికే నిధులు మంజూరై పనులు పెండింగ్లో ఉన్న వాటిని త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లను ఆదేశించారు. కళాభవన్, మినీ ట్యాంక్ బండ్, అమ్మ చెరువు, నల్లచెరువు అభివృద్ధి పనులు త్వరగా చేపట్టాలన్నారు. అలాగే మురుగు కాల్వలు, చిట్యాల, అప్పాయిపల్లి రోడ్ల పురోగతిపై ఆరాతీశారు. ఆయా సమావేశాల్లో సమావేశంలో అదనపు కలెక్టర్ యాదయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్ డీఈ శ్రీనివాస్, ఏఈ పావని తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సులను వినియోగించుకోండి
వనపర్తి రూరల్: గ్రామాల్లో నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం శ్రీరంగాపురం మండలంలోని నాగసానిపల్లి, పెబ్బేరు మండలం రంగాపురంలో రెవెన్యూ సదస్సులను సందర్శించారు. అనంతరం అదే గ్రామంలోని చౌకధర దుకాణానికి ఆకస్మికంగా వెళ్లి రికార్డులు పరిశీలించారు. పాతపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి కొనుగోలు ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా సివిల్ సప్లయ్ అధికారి విశ్వనాథం, ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ రాజు, మురళిగౌడ్, ఆర్ఐ రాధాకృష్ణ పాల్గొన్నారు.