
నేడు మంత్రి పొంగులేటి రాక
వనపర్తి: రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బుధవారం జిల్లా పర్యటనకు వస్తున్నారని.. విజయవంతం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, మంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించిన అనంతరం తన చాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్మించిన పీజీ విద్యార్థుల వసతి భవనం, అధ్యాపకుల భవనం, ఎంపీడీఓ కార్యాలయ సముదాయ ప్రాంగణంలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని ప్రారంభిస్తారని చెప్పారు. అక్కడే రేవల్లి, ఏదుల, శ్రీరంగాపూర్ తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడంతో పాటు కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో ఆధునికీకరించిన బీసీ బాలుర కళాశాల వసతిగృహం, డా. బీఆర్ అంబేడ్కర్ చెరువు సుందరీకరణను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం కల్యాణసాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే భూ భారతి అవగాహన సదస్సు, మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీని చేపడుతారని వెల్లడించారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, రోడ్లు, భవనాలశాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ దేశ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ రమేశ్రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి ఇందిర, హౌసింగ్ పీడీ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి
పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశం