
ఇంటింటికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్
వనపర్తి: మహాత్మాగాంధీ అహింసావాదాన్ని, అంబేడ్కర్ ఆశయ సాధన, రాజ్యాంగ పీఠికను పరిరక్షించుకునే అవసరం ఎంతైనా ఉందని భావించి కాంగ్రెస్పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం గడప గడపకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా జై భీమ్ పదాన్ని అవమానపరుస్తూ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, రాజ్యాంగాన్ని కాపాడాలని భావించి కాంగ్రెస్పార్టీ అది నాయకత్వం జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. సామాజిక మాధ్యమం వేదికగా కాంగ్రెస్పార్టీపై విష ప్రచారం చేసే వారికి బుద్ధి చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ఇంటింటికి చేరవేయాలని సూచించారు. నియోజకవర్గంలో ఒకేరోజు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టామని.. మరికొద్ది రోజుల్లో మరో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు తీసుకురాబోతున్నామని చెప్పారు. అంతకుముందు రాజీవ్గాంధీ చౌరస్తా మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, జాన్, మహ్మద్ నసీర్, సంజీవ్, గౌరీ సతీష్, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదినిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల విజయచందర్, పీసీసీ సభ్యుడు శంకర్ప్రసాద్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి తదితరులు పాల్గొన్నారు.