
ఉగ్రవాదాన్ని రూపుమాపాలి
వనపర్తి: కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డీపీఆర్ఓ సీతారాం కోరారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో వనపర్తి వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనతో ఆయన పాల్గొని దాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్లో అన్ని మతాలు, కులాల వారు ఐక్యమత్యంతో జీవిస్తున్నారని, కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దుచేసి కశ్మీర్ను అభివృద్ధి చేస్తోందని, కొన్నేళ్లుగా పర్యాటకరంగం ఊపందుకుందన్నారు. ఇది ఓర్వలేని వారు ఉగ్రవాదులను ప్రేరేపించి అలజడి సృష్టించేందుకు దాడి చేయించారని తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశం శాంతిని కోరుకుంటుందని అలా అని మన పౌరులపై దాడి చేసి చంపేస్తే ప్రతిఘటన కూడా తీవ్రంగా ఉండాలన్నారు. మరో సీనియర్ జర్నలిస్ట్ కొండన్న మాట్లాడుతూ.. దేశంలో ఎప్పుడు ఉగ్రదాడి జరిగినా దాయది పాకిస్తాన్ హస్తం ఉందని తేటతెల్లమవుతుందని.. ఉగ్రవాదాన్ని తరాలుగా పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.