
ఎండీసీఏ మైదానంలో ‘టర్ఫ్ వికెట్’
మహబూబ్నగర్ క్రీడలు: మహబూబ్నగర్ జిల్లా క్రికెట్ సంఘం (ఎండీసీఏ) ఆధ్వర్యంలో టర్ఫ్ వికెట్ పిచ్లు సిద్ధం చేస్తున్నారు. జిల్లాకేంద్రం పిల్లలమర్రి సమీపంలోని ఈ మైదానంలో క్రీడాకారుల సౌకర్యార్థం చాలా వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు ఉన్న ఏకై క క్రీడా మైదానమిది. ఇప్పటికే ఇక్కడ క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం దాతల సహకారంతో నెట్, రెండు బౌలింగ్ యంత్రాలతో పాటు పెవిలియన్ భవనాన్ని ఏర్పాటు చేశారు.
● క్రికెట్లో టర్ఫ్ వికెట్(పిచ్)లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కేవలం మ్యాట్ల మీద క్రికెట్ ఆడే క్రీడాకారులకు టర్ఫ్ వికెట్పై ఆడాలంటే మెరుగైన ప్రాక్టీస్ ఉండాల్సిందే. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఔత్సాహిక ఉమ్మడి జిల్లా క్రికెట్ క్రీడాకారులకు కల నెరవేరనుంది. గతేడాది ఎండీసీఏ మైదానంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంలో పలువురు హెచ్సీఏ ప్రతినిధులు పాల్గొనగా మైదానంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటు కోసం ఎండీసీఏ ప్రతినిధులు వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హెచ్సీఏ రూ.60 లక్షలు కేటాయించగా.. కొన్ని రోజులుగా పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అదే విధంగా మైదానం మొత్తం పచ్చగడ్డి (గ్రీనరీ)ని ఏర్పాటు చేస్తున్నారు. మైదానంలో వర్షపు నీరు నిలువకుండా ఎత్తు పెంచి చుట్టూ అండర్గ్రౌండ్ పైప్లైన్ వేస్తున్నారు. త్వరలో ఎండీసీఏ మైదానంలో మూడు టర్ఫ్ వికెట్ పిచ్లు అందుబాటులోకి రానున్నాయి.
● టర్ఫ్ వికెట్ పిచ్పైనే జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మ్యాచ్లు ఆడుతారు. ఇంతకాలం మ్యాట్పై ఆడే జిల్లా క్రీడాకారులు టర్ఫ్ వికెట్ అందుబాటులోకి వస్తే వారి ఆటతీరు మరింత మెరుగు పడే అవకాశం ఉంటుంది. హెచ్సీఏ రాష్ట్రస్థాయి టోర్నీల్లో జిల్లా క్రీడాకారులు మరింతగా రాణించవచ్చు. రంజీస్థాయిలో ఆడేలా జిల్లా క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చు. ఎండీసీఏ మైదానంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటయితే భవిష్యత్లో రాష్ట్రస్థాయి మ్యాచ్లతో పాటు రంజీ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది.
త్వరలో మూడు పిచ్లు అందుబాటులోకి..
మైదానం మొత్తం గ్రీనరీ ఏర్పాటు
భవిష్యత్లో రంజీ మ్యాచ్లకు వేదిక కానున్న పాలమూరు

ఎండీసీఏ మైదానంలో ‘టర్ఫ్ వికెట్’