
జూరాల కాల్వలకు నీటి సరఫరా నిలిపివేత
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి ప్రధాన ఎడమ, కుడి కాల్వలకు గురువారం సాయంత్రం నీటి సరఫరా నిలిపివేసినట్లు ఏఈ ఆంజనేయులు తెలిపారు. ఆయా కాల్వల కింద 35 వేల ఎకరాల వరి సాగు చేపట్టగా ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం భారీగా తగ్గిపోవడం, వేసవిలో తాగునీటి అవసరాల దృష్ట్యా ఉన్నతాధికారులు గత వారమే నీటి సరఫరా నిలిపివేశారు. మరో రెండు తడులు అందిస్తేనే పంట చేతికందుతుందని రైతులు ఎమ్మెల్యే, అధికారులకు విన్నవించగా చివరి తడిగా రెండ్రోజుల కిందట నీటిని వదిలారు. గురువారం సాయంత్రం 6 గంటలకు కాల్వ షట్టర్లు మూసి నీటి సరఫరా నిలిపివేసినట్లు ఏఈ వివరించారు.
లాటిన్ అమెరికా
సదస్సుకు జిల్లా వాసి
వనపర్తి: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్లో గురువారం ప్రారంభమైన లాటిన్ అమెరికా సదస్సుకు వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చిన్నదగడకు చెందిన మొలకలపల్లి శివకుమార్ హాజరయ్యారు. స్పానిష్లో తాను చేసిన పరిశోధనలను యూనివర్సిటీ బృందం గుర్తించి సదస్సుకు హాజరై పరిశోధన పత్రాలు సమర్పించాలని ఆహ్వానం పంపినట్లు ఆయన వెల్లడించారు. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన ఆయన ప్రాథమిక విద్యను స్థానికంగా.. హైదరాబాద్ దేశభాషల విశ్వవిద్యాలయంలో స్పానిష్ లాంగ్వేజ్లో డిగ్రీ, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పానిష్ లో పరిశోధకులుగా కొనసాగుతున్నారు.
ప్రజా సమస్యల
పరిష్కారానికి ఉద్యమం
పాన్గల్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, మండల కార్యదర్శి బాల్యనాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో పార్టీ మండల కమిటీ సమావేశాన్ని నాయకుడు భీమయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనట్లు వారు పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజలతో కలిసి పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

జూరాల కాల్వలకు నీటి సరఫరా నిలిపివేత

జూరాల కాల్వలకు నీటి సరఫరా నిలిపివేత