విజయనగరం: ప్రముఖ న్యాయవాది, వైఎస్సార్సీపీ నాయకుడు కోలగట్ల వెంకట నాగ తమ్మన్నశెట్టి సంస్మరణ సభలో పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్ర శాసనసభ మాజీ ఉపసభాపతి, వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నయ్య అయిన తమ్మన్నశెట్టి ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం స్థానిక ఎస్వీఎన్ నగర్లో గల సుజాత కన్వెన్షన్ హాల్లో తమ్మన్నశెట్టి సంస్మరణ సభ నిర్వహించారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, మాజీ ఎంపీ బి. చంద్రశేఖర్, పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, జిల్లా యువజన విభాగం నాయకుడు జి. ఈశ్వర్కౌశిక్, మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, తదితరులు తమ్మన్నశెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ్మన్న శెట్టి లేని లోటు తీర్చలేనిదని నాయకులు అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, న్యాయవాదులు , ఉమ్మడి విజయనగరం జిల్లాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.


