పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ మంచి వేదికని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. కలెక్టరేట్లో డీఆర్ఓ కె. హేమలత, ఎస్డీసీ కల్యాణ్చక్రవర్తితో కలసి 113 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను గుర్తించి వాటిపై సమగ్ర పరిశీలన చేసి పరిష్కరించాలని సూచించారు.
వినతుల్లో కొన్ని..
● రహదారి సౌకర్యం లేక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని కురుపాం మండలం నాయుడుగూడ గ్రామానికి చెందిన వి. మన్మధరావు, తదితరులు వినతిపత్రం అందజేశారు.
● శ్మశానవాటికలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించిన సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పార్వతీపురం మండలం పెదబొండపల్లి పంచాయతీ గదబవలస గ్రామానికి చెందిన పలువురు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
● సైనికుల కోటా కింద అలమండ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 177లో ఉన్న బంజరభూమిని ఇప్పించాలని కోరుతూ జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన జి. మన్మధరావు వినతిపత్రాన్ని అందజేశారు.


