● రోధిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు
సాలూరు రూరల్: మండలంలోని కరకవలస గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి కర్రా దిలీప్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కర్రా దిలీప్ శనివారం పాఠశాలకు వచ్చి తరగతులు పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో పక్కనే ఉన్న అరటి తోటలోకి పాఠశాల గోడ దూకి వెళ్లాడు. తిరిగి పాఠశాలకు వచ్చేందుకు గోడ దూకేందుకు ప్రయత్నించాడు. అయితే గోడ ఎత్తుగా ఉండడంతో పక్కనే ఉన్న వ్యవసాయ పంపుసెట్ బాక్సు మీద నుంచి గోడ ఎక్కేందుకు ప్రయత్నించగా.. విద్యుత్ తీగ తగిలి పడిపోయాడు. వెంటనే ఉపాధ్యాయులు గమనించి విద్యార్థిని మామిడిపల్లి పీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడ నుంచి సాలూరు కేంద్రాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పరిహారం ఇవ్వాలి: మాజీ డిప్యూటీ సీఎం
విద్యుదాఘాతంతో మృతి చెందిన గిరిజన విద్యార్థి కర్రా దిలీప్ కుటుంబానికి ప్రభుత్వం రూ. ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. ఈ విషయంలో గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్
విద్యార్థి మృతి చెందిన సంఘటనా స్థలాన్ని సబ్ కలెక్టర్ వైశాలి శనివారం సాయంత్రం పరిశీలించారు. విద్యుత్ తీగలను పరిశీలించి, పూర్తి నివేదిక అందజేయాలని రెవెన్యూ, విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు.


