విజయనగరం అర్బన్: ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే కార్యక్రమాలు విజయవంతమవుతాయని హోమ్ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అనిత పేర్కొన్నారు. మళ్లీమళ్లీ అవే సమస్యలపై చర్చించాల్సి రావడంపై అసహనం వ్యక్తంచేశారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లా సమీక్షా సమావేశం (డీఆర్సీ)లో కీలక అంశాలపై చర్చ జరిగినా అనేక సమస్యలు పరిష్కారం కాలేదన్న సమాధానమే వచ్చింది. వేసవిలో నీటికొరత రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి గతంలో జరిగిన సమావేశాల్లో సూచించినా మళ్లీ జిల్లాలో అవే సమస్యలు కనిపిస్తున్నాయి. తాగునీటికోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. వంట గ్యాస్ కొరత లేదని సమావేశంలో మంత్రి ప్రకటించినా క్షేత్రస్థాయిలో భిన్నంగా ఉంది. పూసపాటిరేగ ప్రాంతంలో మహిళల్లో అల్సర్ కేసులు పెరిగిన తర్వాత అధ్యయనం చేపట్టడం ప్రభుత్వ తీరును ఎత్తిచూపింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు డాక్టర్ పి.సూర్యనారాయణరాజు (సురేష్బాబు), గాదె శ్రీనివాసులునాయుడు, ఎమ్మెల్యేలు కళావెంకటరావు, కోళ్ల లతిత కుమారి, బేబీనాయన, అదితి గజపతిరాజు, కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్, డీఆర్ఓ సీహెచ్ సత్తిబాబు, సీపీఓ పి.బాలాజీ పాల్గొన్నారు.


