మెరకముడిదాం: మండలంలోని గర్భాం గ్రామానికి చెందిన రెడ్డి సాయికిరణ్ సౌత్జోన్ జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. జేఎన్టీయూ (కె) యూనివర్సిటీ, విజయనగరం జిల్లా తరఫున సాయికిరణ్ ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గోనున్నాడు. జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు సాయికిరణ్ ఎంపిక కావడంపై గర్భాం గ్రామస్తులతో పాటు జేఎన్టీయూ సిబ్బంది అభినందించారు.
ఆరుగురు జూదరుల అరెస్ట్
● రూ.42,420 నగదు సీజ్
తెర్లాం: పేకాటాడుతున్న ఆరుగురు వ్యక్తులను ఎస్సై సాగర్బాబు ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వి.చిన్నయ్యపేట గ్రామానికి సమీపంలోని మామిడితోటలో ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే దాడి చేసి నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుంచి రూ. 42,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై సాగర్బాబు మాట్లాడుతూ.. పేకాట శిబిరాలు నిర్వహించినా, ఆడినా చర్యలు తప్పవన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి
మృతి
● అతడి భార్యకు, పాపకు తీవ్రగాయాలు
రణస్థలం: లావేరు మండలంలోని బుడుమూరు జాతీయ రహదారిపై ఆదివారం బైక్ను కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. స్కూటీపై కె.రమేష్(32) తన భార్య సుజాత, రెండేళ్ల కుమార్తె ధాతిశ్రీతో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో బుడుమూరు దగ్గరకు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో గాయపడిన రమేష్ను స్థానికులు హుటాహుటిన 108 వాహనంపై శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయారు. భార్య సుజాత, పాప ధాతిశ్రీకి బలమైన గాయాలు కావడంతో శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రమేష్ స్వగ్రామం విజయనగరం జిల్లాలోని దాకమర్రి. గార మండలం నిజామాబాద్లో ఉన్న అత్తవారింటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం గ్రామానికి చెందిన మర్రాపు ప్రసాదరావు(60) ఆదివారం ఉదయం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలియజేసిన వివరాల ప్రకారం.. అరటి గెలలు లోడ్ చేయడానికి కూలీలతో కలసి వెళ్లగా తెగిన విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చినమేరంగి ఎస్సై అనీష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడు పెదదోడిజలోని జీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మృతుడికు భార్యతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం జరగ్గా.. కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఉపాధ్యాయుడి మృతిపై ఎంఈఓలు గౌరునాయుడు, శ్రీనివాసరావు, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
మూడు మేకలు మృతి
జామి: మండలంలోని రామయ్యపాలెం గ్రామానికి చెందిన గురపంల్లి పోలయ్య, నిమ్మకాయల అప్పారావుకు చెందిన మూడు మేకలు విద్యుదాఘాతంతో మృతి చెందాయి. ఎస్సీ కాలనీకి చెందిన వీరు గ్రామ సమీపంలో మేకలను మేపుతుండగా.. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో మేకలు సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దవకు వెళ్లగా, షాక్కు గురై మృతి చెందాయి. దీంతో బాధితులు లబోదిబోమంటూ రోదిస్తున్నారు.


