పాడి పశువులకు ఇన్సూరెన్స్ చేయించాలి
● నాబార్డు డీడీఎం నాగార్జున
విజయనగరం ఫోర్ట్: పాడి పశువులకు ఇన్సూరెన్స్ చేయించాలని నాబార్డు డీడీఎం నాగార్జున అన్నారు. పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పాడి పశువులకు వచ్చే వ్యాధులకు సకాలంలో చికిత్స చేయించాలని తెలిపారు. పాల ఉత్పత్తిని పెంచడానికి పశుగ్రాసాలను పెంచుకోవాలన్నారు. సదస్సులో పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
సాంఘిక సంక్షేమ గురుకులాల ప్రవేశ పరీక్ష తేదీ మార్పు
నెల్లిమర్ల: ఉమ్మడి విజయనగరం జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబడ్కేర్ గురుకుల విద్యాలయాల బ్యాక్లాగ్ ఖాళీలకు ప్రవేశ పరీక్ష తేదీ మార్పు చేసినట్టు జిల్లా కో ఆర్డినేటర్ ఎం.మాణిక్యం తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో సాంఘిక సంక్షేమ సోసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2026–2027 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సిన 6, 7, 8, 9, 10వ తరగతులకు సంబంధించి బ్యాక్ లాగ్ ఖాళీలకు ప్రవేశ పరీక్ష తొలిత మార్చి 2వ తేదీన నిర్వహించాల్సి ఉండగా.. పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ 2 నిర్వహించనున్న నేపథ్యంలో ప్రవేశ పరీక్షను మార్చి 8కి వాయిదా వేసినట్టు తెలిపారు. 5వ తరగతి, జూనియర్ ఇంటర్ ప్రవేశ పరీక్షలు మార్చి 1న యథావిధిగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. వివరాలకు 9951120330, 7382077621, 9052693269 నంబర్లకు సంప్రదించాలని కోరారు.
మైనర్లు డ్రైవ్ చేస్తే
అరెస్టు తప్పదు : ఎస్పీ
విజయనగరంక్రైమ్: మైనర్లు డ్రైవింగ్ చేస్తూ చిక్కుల్లో పడొద్దని ఎస్పీ దామోదర్ మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 18 సంవత్సరాల్లోపు పిల్లలకు బైక్లు ఇచ్చి ఇబ్బందులకు గురికావద్దని మైనర్ల తల్లిదండ్రులకు ఎస్పీ హితవు పలికారు. మైనర్లు బైక్లు నడిపితే తప్పని పరిస్థితుల్లో, గత్యంతరం లేక తమ సిబ్బంది కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా సార్లు మైనర్లు డ్రైవింగ్కు పాల్పడ్డుతున్నారని వారిని చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారన్నారు. ఇంతవరకు మైనర్లకు హెచ్చరికలు జారీ చేసి చైతన్యపరిచామని, ఇకపై అలాంటి వాటికి స్వస్తి చెపుతున్నట్టు ఎస్పీ తెలిపారు. మైనర్లు అవగాహన రాహిత్యం, అనుభవం లేమితో రోడ్లపైకి వాహనాలతో వచ్చి పలు ప్రమాదాలకు కారణమవుతున్నారన్నారు. గడచిన ఆరు నెలలుగా జిల్లా వ్యాప్తంగా ఇలా మైనర్లు నడిపిన 1300 కేసులను నమోదు చేశామన్నారు. ఇక నుంచి మైనర్లకు వాహనాలు ఇస్తే.. కన్నవారికి శిక్ష తప్పదని ఎస్పీ హెచ్చరించారు.
ట్రాక్టర్ బోల్తా..
డ్రైవర్కు గాయాలు
మక్కువ: మండలంలోని ఎ.వెంకంపేట గ్రామ సమీపంలోని కాజ్వే వద్ద సోమవారం అర్ధరాత్రి కర్రల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. తెర్లాం మండలం రంగపువలస గ్రామానికి చెందిన బి.కృష్ణ మక్కువ మండలం నుంచి బొబ్బిలి వైపు కర్రల లోడ్ ట్రాక్టర్ నడుపుతుండగా ఎ.వెంకంపేట గ్రామం కాజ్వే వద్ద ట్రాక్టర అదుపుతప్పి బోల్తా పడింది. అదే సమయంలో మక్కువకు చెందిన పలువురు యువకులు బొబ్బిలి నుంచి మక్కువ వస్తుండగా ప్రమాదాన్ని గమనించి డ్రైవర్ కృష్ణ అపస్మారక స్థితిలో ఉండడాన్ని వెంటనే 108కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి 108 సిబ్బంది చేరుకుని బొబ్బిలి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.


