విజయనగరంలో కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేయండి
● మండలిలో ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స
నెల్లిమర్ల రూరల్: జిల్లాలో కేన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శాసనమండలిలో కేన్సర్ ఆస్పత్రి అంశాన్ని మంగళవారం ప్రస్తావించారు. ప్రస్తుతం కేన్సర్ కేసులు అధికంగా ఉన్నాయని, చికిత్సకు అవసరమైన సౌకర్యాలు ఉత్తరాంధ్రలో పరిమితంగా ఉన్నాయన్నారు. విశాఖలో ఉన్న కేన్సర్ ఆస్పత్రికి రోగుల తాకిడి అధికంగా ఉండడం వల్ల సత్వర చికిత్స, నిర్ధారణ పరీక్షలు ఆలస్యమై ప్రాణాపాయ పరిస్థితులు వస్తున్నాయన్నారు. విజయనగరంలో ఆస్పత్రిని ఏర్పాటు చేయడంవల్ల ఇటు శ్రీకాకుళం అటు పార్వతీపురం మన్యం జిల్లాల ప్రజలకు ప్రయాణ దూరం తగ్గడమే కాకుండా వైద్యం కూడా సత్వరమే అందే అవకాశం ఉందన్నారు. చికిత్స ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని, పేదల ఆరోగ్యం దృష్ట్యా కేన్సర్ ఆస్పత్రి, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.


