గంజాయి రహితమే లక్ష్యం : ఎస్పీ
పార్వతీపురం రూరల్: అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో గంజాయి సాగు, రవాణాను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పని చేస్తోందని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి తెలిపారు. విశాఖపట్నం రేంజ్ ఐజీపీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ – ఒడిశా రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల అంతర్రాష్ట్ర సమన్వయ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో గంజాయి నిర్మూలనకు చేపట్టిన చర్యలను ఎస్పీ వివరించారు. జిల్లాలో గంజాయి సాగును నామరూపాల్లేకుండా చేసేందుకు ’సున్నా సాగు’లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఎస్పీ పేర్కొన్నారు. గిరిజన రైతులకు గంజాయికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడంతో పాటు, విత్తనాలు మరియు మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పించి ఉపాధి మార్గాలు చూపుతున్నామని వివరించారు.అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేలా చెక్పోస్టుల వద్ద నిరంతర తనిఖీలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. సాంకేతికతను జోడించి నేరగాళ్లను గుర్తిస్తున్నామని, తరచూ నేరాలకు పాల్పడే వారిపై పీఐటీ ఎన్డీపీఎస్ కింద చర్యలు తీసుకోవడంతో పాటు, వారి ఆస్తులను జప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఒడిశా పోలీసుల సహకారంతో ‘ఆపరేషన్ సంయుక్త’ను మరింత పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. సమావేశంలో ఐజీపీ సూచనల మేరకు సరిహద్దు జిల్లాల మధ్య సమాచార మార్పిడికి ప్రత్యేక లైజన్ అధికారులను నియమించనున్నట్టు ఎస్పీ మాధవ్రెడ్డి వెల్లడించారు.


