అమ్మభాషతోనే ఆత్మగౌరవం
● రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు
విక్రమ్పూల
● ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలకు అంతర్జాతీయ
మాతృభాషా పురస్కారం ప్రదానం
విజయనరం: అమ్మభాషతోనే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం లభిస్తాయని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు విక్రమ్ పూల ఉద్ఘాటించారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గీతాంజలి పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పండగ వాతావరణంలో జరిగింది. తెలుగు అక్షరాలు తోరణాలయ్యాయి. అమ్మభాషలో పదాలు మనసుల్లో సందడి చేశాయి. అచ్చులు.. హల్లులు పోటీ పడుతూ తల్లి భాష వైభవాన్ని కళ్లముందు కదలాడించాయి. సమితి అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విక్రమ్ పూల మాట్లాడుతూ ఒక ప్రపంచాన్ని సృష్టించే బలం తెలుగు భాషకు ఉందని, భాష మనతో పాటు మన మనసులో, ఆత్మలో ఉంటుందని వాఖ్యానించారు. మాతృభాష వాడుకలో ఉన్నంత కాలం మనకు గౌరవం, మర్యాద, గుర్తింపు లభిస్తాయని చెప్పారు. సమితి అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ ‘అమ్మ’ ఒడిలోను చదువుల తల్లి బడిలోను, బతుకు మడిలోను, సంస్కారపు గుడిలోను, తెలుగునుడి మనశ్వాస కావాలని, తల్లి ఒడిలోనే పిల్లలకు భాషపై ఇష్టాన్ని పెంచాలని కోరారు. ‘భాష, వారసత్వం, సంస్కృతితోనే మన సంబంధాలు బలోపేతం అవుతాయని అన్నారు. కార్యక్రమాన్ని ముతవల్లి, ఖాదర్బాబా దర్గా దర్బార్ షరీఫ్, డాక్టర్ ఖలీల్ బాబు కుమారుడు మహమ్మద్ అహ్మదుల్లా షరీఫ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గీతాంజలి పాఠశాల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినుల దేశభక్తి, మాతృ భాష పరిరక్షణ కోసం చేసిన కార్యక్రమం, రంగస్థల కళాకారుడు మండా రమేష్ ప్రదర్శించిన దుర్యోధన ఏకపాత్రాభినయం, ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్యకు చెందిన గాయనీగాయకులు ఉమామహేశ్వరి, కూర్మారావులు ఆలపించిన సినీగీతాలు, శైలజ కుమారి ఆలపించిన దేశభక్తి గీతాలు, సమైక్య భారతి కార్యదర్శి ధవళ సర్వేశ్వరరావు ఆలపించిన పద్యాలు అందరినీ అలరించాయి. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య రొక్కం సుదర్శనరావు, ఆంధ్ర విశ్వకళాపరిషత్ రాజనీతి శాస్త్ర విభాగ అధిపతి ఆచార్య పి.ప్రేమానందం, సమైక్య భారతి సమన్వయకర్త పి.కన్నయ్య, ఎం.వి. సత్యనారాయణ తెలుగు భాష గొప్పదనాన్ని, మాతృభాష విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో భాగంగా మాతృభాష పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఆదిత్యా మహిళా డిగ్రీ కళాశాలకు అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ పురస్కారాన్ని సమితి అధ్యక్షుడు గురుప్రసాద్తో కలిసి విక్రమ్ పూల ప్రదానంచేశారు. కార్యక్రమంలో గీతాంజలి పాఠశాల కరస్పాండెంట్ ఎ శ్రీనివాసరావు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉత్తరాంధ్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పలుకూరి ప్రభావతి, సమితి కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ, సలహాదారులు ముళ్లపూడి సుభద్రాదేవి, దాసరి పద్మ, పాఠశాల డైరెక్టర్ రాజేష్, ప్రధాన ఉపాధ్యాయురాలు మల్లిక, తదితరులు పాల్గొన్నారు.
మండా రమేష్ దుర్యోధన ఏకపాత్రా
భినయం
అమ్మభాషతోనే ఆత్మగౌరవం
అమ్మభాషతోనే ఆత్మగౌరవం


