పీహెచ్సీని తనిఖీ చేసిన జేసీ
● రోగుల పట్ల మర్యాదగా మెలగాలి
● విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : జేసీ
కొమరాడ: ప్రభుత్వ వైద్యం పేదలకు వరమని, ప్రతీ ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి పేర్కొన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల సిబ్బంది మర్యాదగా మెలగాలని, సత్వరమే చికిత్స అందించాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలోని కూనేరు రామభద్రపురం పీహెచ్సీని జేసీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో వివిధ భాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి సిబ్బంది బయోమెట్రిక్ హాజరును, విధులకు హాజరైన తీరును జేసీ స్వయంగా పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం, వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణాన్ని, వార్డులను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రిలో మందుల నిల్వలు, వ్యాక్సిన్ల భద్రతను స్వయంగా పరిశీలించారు. మందుల కొరత లేకుండా చూడాలని, స్టాక్ అయిపోక ముందే ఇండెంట్ పంపాలని ఆదేశించారు. ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు నిల్వ చేసే ఫ్రిజ్ను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యాక్సిన్ల సామర్థ్యం దెబ్బతినకుండా కోల్డ్ చైన్ వ్యవస్థను పటిష్టంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. తనిఖీల్లో స్థానిక వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, ఆరోగ్య కార్యకర్తలు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


