అంకితభావంతో వైద్యులు సేవలందించాలి
● విజయనగరం మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి
● నెల్లిమర్లలో ఎస్ఎస్ ఆస్పత్రి ప్రారంభం
నెల్లిమర్ల: వైద్యులు రోగులకు అంకితభావంతో సేవలు అందించాలని విజయనగరం మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి అన్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్ ఆస్పత్రిని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వృత్తులలో వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందన్నారు. వైద్యులు వ్యాపారం దృక్పథంతో కాకుండా మానవతా దృక్పథంతో రోగులకు సేవలందించాలని కోరారు. నెల్లిమర్ల పట్టణంలో జనరల్ మెడిసన్, దంత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన వైద్యులు డాక్టర్ సారిక చంద్రమౌళి, డాక్టర్ దివ్యదీప్తిలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందుబాటులోకి తీసుకువచ్చిన సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు సరోజిని, పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చిక్కాల సాంబశివరావు, డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షుడు చనమల్లు వెంకటరమణ, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


