ఆగని భూ దందా..!
కొత్తవలసలో
కొత్తవలస:
కొత్తవలస విశాఖపట్నానికి చేరువగా ఉండడం, భూముల ధరలకు రెక్కలు రావడంతో భూ దందా యథేచ్ఛగా సాగుతోంది. బడాబాబుల ఒత్తిడి, అండదండలతో ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పేరున జిరాయితీగా మారిపోతున్నాయి. అక్రమాలకు తెరలేపుతున్నాయి. ఇదే విషయంపై మూడునెలల కిందట ‘భూ మాయ’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అప్పటి తహసీల్దార్ అప్పలరాజును సస్పెండ్ చేశారు. విచారణ అధికారిగా కేఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళిని నియమించారు. ఓ వారం రోజుల పాటు రెవెన్యూ సిబ్బందిని కలెక్టరేట్కు పిలిపించి విచారణ పేరుతో హడావిడి చేశారు. ఆ తర్వాత ఏమైందో.. ఏ నేత నుంచి ఒత్తిడి వచ్చిందో తెలియదు విచారణ ఇప్పటికీ కొనసా...గుతూనే ఉంది. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పేరిటే వెబ్ల్యాండ్లో కనిపిస్తున్నాయి. కబ్జాల కట్టడికి రెవెన్యూ అధికారులు చేపట్టిన చర్యలు షరామామూలుగా మారడం, నెలలు తరబడుతున్నా విచారణ పేరిట జాప్యం చేస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. భూముల దందా వెనుక బడానేతల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో రూ.కోట్లు చేతులు మారాయన్న చర్చ కొత్తవలసలో జోరందుకుంది. క్రయవిక్రయాలు జరిగితే ఎవరు బాధ్యలవుతారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదే విషయాన్ని విచారణ అధికారి మురళీ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా విచారణ ఇంకా కొనసాగుతోందని బదులిచ్చారు.
ఆగని భూ దందా..!


