ఆలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
● శంబర పోలమాంబ అమ్మవారిని
దర్శించిన దేవదాయశాఖ
ఉప కమిషనర్ సుజాత
మక్కువ: దేవాలయాలకు వచ్చిన ఆదాయంతో ఆలయాల్లో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని దేవదాయశాఖ ఉప కమిషనర్ (విశాఖపట్నం) ఎన్.సుజాత తెలిపారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారిని శుక్రవారం ఆమె దర్శించుకున్నారు. ఈఓ బి.శ్రీనివాస్, ట్రస్టుబోర్డు చైర్మన్ చినతిరుపతి ఆమెకు సాదరంగా స్వాగతించి ప్రత్యేక పూజలు జరిపించారు. దుశ్శాలువతో సత్కరించి, చీర, అమ్మవారి ఫొటోను అందజేశారు. అనంతరం ఆమె వనంగుడిలో పోలమాంబ అమ్మవారిని దర్శించుకొని, ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడ స్థానిక విలేకరులతో మాట్లాడారు. పోలమాంబ సిరిమానోత్సవం వైభవంగా జరిగిందని, మిగిలిన ఆరువారాలు జాతర సక్రమంగా నిర్వహించేలా అధికారులకు సూచనలు చేశామన్నారు. విశాఖపట్టణం డిప్యూటీ కమిషనర్ కార్యాలయం పరిధిలోని ఆరు జిల్లాలో 500 మంది అర్చకులకు దీప, దూపనైవేద్యాలు పథకం ప్రతినెలా రూ.10వేలు అందజేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. మరో 300 మంది అర్చకులకు గౌరవవేతనం అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఈనెల 22వ తేదీ నుండి జామి, రాజాం, చీపురుపల్లిలో జరగునున్న జాతర్లకు ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. ఆమె వెంట దేవదాయశాఖ సూపరింటెండెంట్ ఎస్.విజయకుమార్, పార్వతీపురం మన్యంజిల్లా దేవదాయశాఖాధికారి ఎస్.రాజారావు, సిబ్బంది పాల్గొన్నారు.


