సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా.. ముందడుగు..!
విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న రోడ్డుప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో జిల్లాలో రవాణ భద్రతపై ట్రాన్స్పోర్టు శాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రయాణికుల ప్రాణ భద్రత, ముఖ్యంగా స్కూల్, కళాశాల విద్యార్థుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తనిఖీల్లో అత్యవసర ద్వారాల వద్ద స్లీపర్ బెర్తులు ఏర్పాటు చేయడం వంటి ప్రమాదకర మార్పులు అధికారులు గుర్తించారు. ప్రమాద సమయంలో బయటకు వెళ్లే మార్గాలు అడ్డంకిగా మారేలా మార్పులు చేయడం తీవ్రమైన నిర్లక్ష్యంగా గుర్తించి హెచ్చరికలు జారీ చేశారు. తనిఖీల్లో అత్యవసర ద్వారాల వద్ద స్లీపర్ బెర్త్లు ఏర్పాటు వంటి ప్రమాదకర మార్పులు గుర్తించినట్టు అధికారులు పేర్కొంటున్నారు.
నిర్లక్ష్యం..
చాలా బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు లేకపోవడం..ఫైర్ నివారణ పరికరాలు లేకపోవడం అధికారులు గుర్తించారు. ఇది ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో నెట్టడమేనని అధికారులే చెబుతున్నారు. అగ్ని ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల సమయంలో అవసరమైన పరికరాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.
జరిమానాలు, కఠిన హెచ్చరికలు
నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై జరిమానాలు విధించామని, భద్రతా ప్రమానాలు సరి చేయకుంటే వాహనాల స్వాధీనం చేసుకుంటామని సంబంధిత ట్రావెల్స్ యాజమాన్యాలను ట్రాన్స్పోర్టు శాఖ హెచ్చరించింది. సీటింగ్ అమరిక, అత్యవసర మార్గాలు, పత్రాల పరంగా లోపాలు ఉన్నవారిపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరికలు చేశారు.
స్కూల్, కళాశాల బస్సులపై ప్రత్యేక దృష్టి
ప్రైవేటు బస్సులతో పాటు స్కూల్, కళాశాల బస్సులపై కూడా తనిఖీలను విస్తరించనున్నట్టు అధికారులు తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని యాధృచ్ఛిక ఫిట్నెస్ పరీక్షలు, డ్రైవర్ల అర్హతలు, వాహనాల సాంకేతిక ప్రమాణాలు పరిశీలిస్తున్నామని వివరించారు.
ప్రమాదాలు ఇలా..
కొన్ని వాహనాల్లో అధిక లోడింగ్, వేగ నియంత్రణలో నిర్లక్ష్యం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయని అధికారులు గుర్తించారు. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు.
విద్యాసంస్థల యాజమాన్యాలకు సూచనలు
విద్యార్థుల రవాణా నిర్వహణలో విద్యా సంస్థల యా జమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ట్రాన్స్పోర్టు శాఖ అధికారులు సూచిస్తున్నారు. వాహనాల నిర్వహణ, డ్రైవర్ల ప్రవర్తన, భద్రతా పరికరాల అందుబాటులో ఉంచడం వంటి అంశాల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేస్తున్నారు.
స్కూల్, కళాశాల బస్సులపై ప్రత్యేక నిఘా
భద్రతా నిబంధనల అమలు విషయంలో రాజీ లేదు
అధిక లోడింగ్, వేగం ప్రమాదాలకు మూలం
బస్సుల ఫిట్నెస్పై తనిఖీలు ముమ్మరం
ఫిట్నెస్, సేఫ్టీపై 27న బస్సుల తనిఖీ
అగ్నిమాపక పరికరాల లేమిపై తీవ్ర
ఆందోళన
భద్రతపై రాజీ లేదు...
విద్యార్థుల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదు. భద్రతా నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూల్, కళాశాల బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వాహనాల స్వాధీనం కూడా చేసుకుంటాం. యాజమాన్యాలు వెంటనే లోపాలు సరి చేసుకోవాలి. ప్రయాణ భద్రత అందరి బాధ్యత.
– డి.మణికుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్టు
కమిషనర్, విజయనగరం
సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా.. ముందడుగు..!
సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా.. ముందడుగు..!


