మార్చి 14న జాతీయ లోక్ అదాలత్
● రెండవ అదనపు జిల్లా జడ్జి
ఎస్.దామోదరరావు
పార్వతీపురం: ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీసులు, ఇతర అధికారులతో ఆయన బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జిల్లా కోర్టు ప్రాంగణంలో జరుగుతుందన్నారు. ఈ లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్ కాంపౌండబుల్, బ్యాంకు రుణాలు, ఇన్సూరెన్స్, కుటుంబ వివాదాలు, ట్రాఫిక్, పబ్లిక్ యుటిలిటీ కేసులు వంటి వివాదాలను ఇరు పక్షాల సమ్మతి ద్వారా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ప్రజల సమయం, ధనం, మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. కక్షిదారులు తమ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జడ్జి పేర్కొన్నారు. న్యాయసేవలు అందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ప్రజలు న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. లోక్ అదాలత్ కార్యక్రమానికి తగిన పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జె.సౌమ్య జాస్ఫిన్, న్యాయవాదులు శ్రీనివాస్, కృష్ణ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కిరాక్ ఆర్పీపై చర్యలు తీసుకోవాలి
విజయనగరం: శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణపై అనుచిత వాఖ్యలు చేసిన టీవీ అర్టిస్ట్ట్ కిరాక్ ఆర్పీపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరంలోని బొత్స సత్యనారాయణకు చెందిన అభిమానులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నగరంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో సీఐకు ఫిర్యాదు చేశారు. బీసీ నాయకుడిగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిన బొత్స సత్యనారాయణ అనారోగ్య సమస్యను హేలన చేస్తూ వ్యంగ్యంగా వాఖ్యలు చేయటం బాధాకరమన్నారు. కిరాక్ ఆర్పీ చేసిన వాఖ్యలు యావత్ ఆంధ్ర రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఉన్న బొత్సపై ఇటువంటి వాఖ్యలు సరి కాదని హితవు చెప్పారు. తక్షణమే కిరాక్ ఆర్పీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ యవర్ణ కుమారస్వామి, పి.అప్పారావు, సిహెచ్.బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
మార్చి 14న జాతీయ లోక్ అదాలత్


