ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ
తెర్లాం: రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న హెరిటేజ్ డెయిరీ పాల లారీ బలంగా ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొక వ్యక్తి గాయాల పాలైన ఘటన మండలంలోని కూనాయవలస వద్ద మంగళవారం రాత్రి జరిగింది. దీనికి సంబంధించి తెర్లాం ఎస్ఐ సాగర్బాబు బుధవారం తెలిపిన వివరాలు.. మంగళవారం రాత్రి 10గంటల సమయంలో కూనాయవలస కొండల పోలమ్మ గుడి వద్ద ద్విచక్ర వాహనాన్ని రామభద్రపురం వైపు నుంచి రాజాం వైపు వస్తున్న హెరిటేజ్ డెయిరీ పాల లారీ ఢీకొనడంతో జన్నివలస గ్రామానికి చెందిన చప్ప అప్పలస్వామి(56) మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన బొడ్డు సీతన్నకు గాయాలయ్యాయి.
కొండల పోలమ్మ గుడి వద్ద మంగళవారం రాత్రి శివభాగవతం జరుగుతుందని తెలిసి అప్పలస్వామి, సీతన్న కలిసి టీవీఎస్ ఎక్సెల్పై జన్నివలస గ్రామం నుంచి చూడడానికి వచ్చారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చొన్న అప్పలస్వామి మృతి చెందగా, వాహనాన్ని నడుపుతున్న సీతన్న గాయాల పాలయ్యాడు. మృతదేహానికి గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో శవపంచనామ చేసి పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. గాయాల పాలైన సీతన్న బాడంగి సీహెచ్సీలో చికిత్స పొందుతున్నాడు. మృతునికి భార్య పార్వతి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న అప్పలస్వామి మృతి చెందడంతో భార్య, పిల్లలు విలపించారు. మృతుని కుమారుడు చప్ప గంగరాజు స్థానిక పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాగర్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


