ఉత్కంఠ రేపిన ఐఓసీఎల్ మాక్ డ్రిల్
లక్కవరపుకోట : అరకు–విశాఖపట్నం జాతీయ రహదారిని ఆనుకొని పంట పొలాల్లో పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్న పైర్ సిబ్బంది, మరో పక్క కుయ్ కుయ్ అంటూ అంబులెన్స్లు పరుగులు, పంట పొలాల్లోంచి రైతులు తలో దిక్కుకు పరుగులు.. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఒకింత తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఇదంతా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీఎల్) వారు నిర్వహించిన మాక్ డ్రిల్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని రంగాపురం గ్రామం సమీపంలో పారాదీప్ నుంచి హైదరాబాద్కు వెళ్లే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు చెందిన పైప్ లైన్ బ్లాస్టప్ గ్రామ అవగాహన కార్యక్రమాన్ని వందేమాతరం – 150 వసంతాలను పురష్కరించుకొని ఆ సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ టి.సాయికిశోర్ ఆధ్వర్యంలో బుధవారం మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 860 కిలోమీటర్లు పొడువున నిర్మించిన ఈ పైపులైన్లో ఎక్కడైనా లీకై బ్లాస్ట్ అయితే ఆ ప్రమాదాన్ని గుర్తించడం, నివారణ చర్యలు చేపట్టడం తదితర అంశాలను ప్రయోగాత్మకంగా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పైప్ లైన్లో జరిగే ప్రమాదాలను వివరించారు. ప్రమాదాలు సంభవించే సమయంలో అప్రమత్తం చేయడం, టోల్ ఫ్రీ నంబరు ద్వారా సంస్థకు సమాచారం అందించే విధానం తదితర అంశాలపై వివరించారు. ప్రమాద సమాచారం అందించే వారికి సంస్థ పెద్ద ఎత్తున ప్రోత్సాహాకాలు అందజేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఐఓసీఎల్ సీనియర్ మేనేజర్ కోట దిలీప్కుమార్, మేనేజర్ అబిద్హుసేన్, మేజర్ మహిద్, గణేష్బాబు, సింధూర, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ వై.సత్యనారాయణ, స్థానిక వైద్యులు అనిల్కుమార్, ప్రవీన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.


