కల్పించలేదమ్మా వసతి!
ఇదేమిటమ్మా అదితి..
విజయనగరం రూరల్:
మాటలు కోటలు దాటుతున్నాయి. పనులు మాత్రం గడపదాటడం లేదు. రాజుగారమ్మాయి... చంద్రబాబుకు అభిమానపాత్రురాలు... ఆమె చిటికె వేయాలే కాని నిధులు వర్షాకాలం పెద్దచెరువు నీరు పారినట్టు పారెస్తాయి. ఎక్కడ చూసినా పనులు... ప్రాజెక్టులు, భవనాలు... ఇలా అభివృద్ధి వందేభారత్ రైలు మాదిరి పరుగులెడుతుంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం... లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి తరువాత మూడో స్థానం విజయనగరమే... అని ప్రజలు ఆశపడ్డారు. అంతే.. అక్కడితో వారి ఆశలు అడియాసలయ్యాయి. రూ.కోట్లు వస్తున్నట్లు ప్రకటనలు అయితే వచ్చాయి కానీ రూపాయి నిధులు విడుదలకాలేదు. ఆఖరుకు జొన్నవలస బీసీ బాలుర వసతి గృహ నిర్మాణానికి దాదాపు రూ.2 కోట్లు నిధులు సైతం రాబట్టుకోలేని పరిస్థితి. దీంతో కనీస సదుపాయాలు లేక విద్యార్థులు వసతి గృహాన్ని వదిలి పరాయి పంచన విడిది చేయాల్సిన దుస్థితి.
విజయనగరం జొన్నవలస బీసీ బాలుర వసతిగృహ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఏడాది కిందట స్థానిక నాయకులతో జొన్నవలస గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని బీసీ బాలుర వసతిగృహ విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించి వసతి గృహ నిర్మాణానికి రూ.1.95 కోట్లు నిధులు మంజూరయ్యాయని ఆర్భాటంగా ప్రకటించారు. ఇంకేముంది రాజుగారమ్మాయి మాటిచ్చారంటే భవనం పూర్తయిపోయిందన్న ఆనందం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కలిగింది. నెలలు గడిచినా మంజూరవుతాయన్న నిధులు రాలేదు. భవన నిర్మాణానికి పునాది రాయి పడలేదు. ఎంతో ఆశతో ఎదురుచూసినా విద్యార్థులు, వసతి గృహ సిబ్బంది భవన నిర్మాణం ఊసే లేకపోవడంతో సమీపంలో ఉన్న ప్రైవేటు భవనంలో తలదాచుకుంటున్నారు. విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు సర్కారు వాస్తవ పరిస్థితిలో వారి సంక్షేమాన్ని గాలికొదిలేసింది. దీంతో బీసీ బాలుర వసతి గృహం కనీస సదుపాయాలు లేక సమస్యలతో సతమతమవుతోంది. సదుపాయాల లేమితో ఏటా విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఐదేళ్ల కిందట వందకు పైగా ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 22 మంది విద్యార్థులకే పరిమితమైందంటే వసతిగృహం పరిస్థితి తేటతెల్లమవుతుంది. మండలంలో ఒకే ఒక వసతి గృహం ఉన్నా కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడం విశేషం.
ఏడాది గడిచినా..
అధ్వానంగా మరుగుదొడ్లు
విద్యార్థులకు వసతి గృహంలోనే భోజనం వడ్డిస్తున్నారు. ప్రత్యేక గదిలేక పోవడంతో భోజనాలు ఆరుబయటే చేస్తున్నారు. వసతి గృహం ప్రాంగణంలోని మరుగుదొడ్లు నిర్వహణ అధ్వానంగా ఉండడంతో వాటిని వినియోగించడమే మానేశారు. కనీసం వచ్చే విద్యా సంవత్సరంలోనైనా వసతి గృహం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.
జొన్నవలస బీసీ బాలుర వసతి గృహ విద్యార్థులకు తప్పని వసతి కష్టాలు
వసతి గృహం నిర్మాణానికి రూ.1.95 కోట్లు నిధులు మంజూరయ్యాయని
అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే అదితి ప్రకటన
ఏడాది గడుస్తున్నా పడని పునాది రాయి
కనీస సదుపాయాలు లేక పరాయి నీడన విద్యార్థులు
ఈ ఏడాదైనా నిర్మాణం మొదలైనయ్యేనా అని ప్రశ్నిస్తున్న తల్లిడండ్రులు
కల్పించలేదమ్మా వసతి!
కల్పించలేదమ్మా వసతి!


