కన్నపేగులను కాపాడి.. తనువు చాలించిన తల్లి
● పౌర్ణమి వేళ విషాదం
● వేగావతినదిలో మునిగి మరణించిన వివాహిత
బాడంగి:
కడుపున పుట్టిన పిల్లలు నదిలో మునిగిపోతుండగా కాపాడిన ఓ తల్లి తాను ప్రవాహంలో కొట్టుకుపోయి బుధవారం మృతిచెందింది. ఈ దురదృష్టకర సంఘటనపై పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలంలోని ఆనవరం గ్రామానికి చెందిన అంపావల్లి సంతు(32) కార్తీకపౌర్ణమి ఉపవాసం ఉండి నోము నోచుకోవాలని పాప కీర్తి, బాబు చరణ్లతో కలిసి వేగావతి నదిలో స్నానం చేయడానికి వెళ్లింది. పిల్లలు ఆడుకుంటూ నది లోతులోకి వెళ్లిపోతూ ప్రమాదంలో పడ్డారు. కేకలు వేయడంతో తేరుకున్న సంతు వారిని ఆదుకునే క్రమంలో గోతిలో దిగి పిల్లలను కాపాడి తను వరదప్రవాహంలో కొట్టుకుపోయింది. పక్కనే కొంత దూరంలో ఉన్న కారాడ పథకం వద్ద తేలగా బంధువులు, గ్రామస్తులు బయటకుతీశారు. వెంటనే ఆమెను చికిత్సకోసం బాడంగి సీహెచ్సీకి తీసుకు రాగా వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం భద్రపరిచారు. కళ్లముందే నీటిలో కొట్టుకుపోతూ తల్లి చనిపోవడంతో పిల్లలిద్దరూ కన్నీరుపెట్టారు. నాయనమ్మ వారిని అక్కున చేరుకుని సముదాయింది. పౌర్ణమి వేళ పుణ్యస్నానం కోసం వెళ్లిన మహిళ మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. మృతురాలి భర్త అనంత కుమార్ ఫిర్యాదు మేరకు హెచ్సీ ఉమామహేశ్వరరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కన్నపేగులను కాపాడి.. తనువు చాలించిన తల్లి
కన్నపేగులను కాపాడి.. తనువు చాలించిన తల్లి


