వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి
భోగాపురం: ఐచర్ వ్యాన్ డీకొట్టడంతో మండలంలోని ముంజేరు పంచాయతీ ధనాలపేట గ్రామానికి చెందిన ధనాల గోవిందు (37) మృతిచెందిన సంఘటన శనివారం ఉదయం మండల కేంద్రంలోని అప్పన్నపేట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ధనాలపేట గ్రామానికి చెందిన గోవిందు విమానాశ్రయం నిర్మాణ పనులలో కూలీగా పని చేస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. మృతునికి తల్లిదండ్రులతో పాటు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మృతుని తల్లిదండ్రులు డెంకాడ మండలం అక్కివరం సమీపంలో ఉన్న జామి తోటలో ఒక యాజమాని దగ్గర కూలీలుగా పని చేస్తున్నారు. గోవిందు తన తల్లిదండ్రులను కలిసేందుకు ధనాలపేట నుంచి బైక్పై అక్కివరం జామి తోట వద్దకు బయలు దేరాడు. ఈ క్రమంలో అప్పన్నపేట వద్దకు చేరుకునే సరికి భోగాపురం నుంచి ఉప్పు లోడుతో ముక్కాం వెళ్తున్న ఐచర్ వ్యాన్ ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో గోవిందు తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ధనాలపేట గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలుముకొంది. ఇంటికి పెద్దదిక్కు చనిపోవడంతో మృతుని భార్య కొండమ్మ తన ముగ్గురు ఆడ పిల్లలతో రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. డ్రైవర్ గంగాధరయ్య వ్యాన్ను నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట సీహెచ్సీకి తరలించారు. భార్య కొండమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వి.పాపారావు తెలిపారు.
బొండపల్లి: మండలంలోని గోట్లాం గ్రామంలో గల కోనేరులో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై యు.మహేష్ తెలిపిన వివరాలు... గ్రామానికి సమీపంలో గల కోనేరులో గుర్తు పట్టడానికి వీలు లేకుండా బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిపారు. ఈ మేరకు ఆ ప్రాంతాన్ని పరిశీలించి మృతుని వద్ద ఆధారాల కోసం పరిశీలించగా ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. ఈ మేరకు మృతదేహాన్ని పంచనామ నిమిత్తం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 9121109462 నంబరుకు సమాచారం అందజేయాలని చెప్పారు.
ఒడిశా వాసి అనుమానాస్పద మృతి
విజయనగరం క్రైమ్: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో ఒడిశాకు చెందిన కలియాగౌడ్(27) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వన్టౌన్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ పార్కింగ్ వద్ద ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపురానికి చెందిన కలియాగౌడ్ శుక్రవారం రాత్రి కంపెనీ పని నిమిత్తం విజయనగరం వచ్చాడు. ట్రైన్లో దిగి ఇక్కడి నుంచి భీమిలి వెళ్తున్న సమయంలోనే అనుమానాస్పదంగా కింద పడి ఉండటంతో స్థానికులు చూసి అతని వద్ద ఉన్న బ్యాగ్లో ఫోన్ నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న కలియాగౌడ్ బంధువులు బరంపురం నుంచి వచ్చి పరిస్థితి గమనించి మృతి చెందినట్టుగా వన్టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి


