
వైభవంగా ఆదిత్యహృదయ హోమం
నెల్లిమర్ల రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో సుందరకాండ హవనం, గాయత్రి రామాయణం, ఆదిత్య హృదయ హోమాలను వైభవంగా జరిపించారు. అనంతరం స్వామి సన్నిధిలో సీతారాముల కల్యాణాన్ని వేడుకగా జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు నరసింహాచార్యులు, కిరణ్, వరప్రసాద్, రామగోపాల్ పాల్గొన్నారు.