
కోవిడ్పై సన్నద్ధత శూన్యం..!
విజయనగరం ఫోర్ట్: కోవిడ్ పేరు వింటేనే జనంలో వణుకుపుడుతుంది. నాలుగేళ్ల కిందట విలయతాండవం సృష్టించిన మహమ్మారి మళ్లీ దేశంలోకి ప్రవేశించింది. కేసుల నమోదు రోజురోజుకూ పెరుగుతోంది. మన పొరుగునే ఉన్న విశాఖపట్నం జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా వ్యవ హరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. కోవిడ్ను ఎదుర్కొనే సన్నద్ధత చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసి కోవిడ్ మహ మ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొందని, వైద్య సేవలతో మరణాలను తగ్గించగలిగిందని, ప్రస్తుతం అలాంటి ఏర్పాట్లు ఏవీ లేకపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
కోవిడ్ పరీక్షలకు ఏర్పాట్లు ఏవీ..?
ఏ ఆరోగ్య సమస్య వచ్చినా జిల్లా ప్రజలు అధిక మంది ఆశ్రయించేది ప్రభుత్వ సర్వజన ఆస్పత్రినే. అటువంటి ఆస్పత్రిలో కోవిడ్ వ్యాప్తి చెందితే ఎదుర్కొనేందుకు ఎటువంటి ముందుస్తు చర్యలు కనిపించడం లేదు. కోవిడ్ రోగులకు ప్రత్యేక వార్డు ఇంతవరకు గుర్తించ లేదు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు వస్తే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా ఇంతవరకు చేయలేదు. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి పెరిగితే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అప్పటిలో పటిష్ట చర్యలు
కోవిడ్ను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొంది. కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న వారందరికీ గ్రామాలకు వెళ్లి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన చికిత్స అందించే ఏర్పాట్లు చేసింది. ప్రజల ఆరోగ్య పరిస్థితిని బట్టి హోం ఐసోలేషన్లో కొందరికి, క్వారంటైన్ సెంటర్లలో కొందరికి, ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేసి మరికొందరికి చికిత్స అందించింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సదుపాయాలను కల్పించింది. కోవిడ్ వైరస్ సోకినా ప్రభుత్వం చికిత్స చేయిస్తుందనే ధీమా ఉండేది. ఇప్పుడు అలాంటి చర్యలేవీ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఆదేశాలు రాలేదు..
కోవిడ్ ఏర్పాట్లపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. డీఎంఈ సూచనల మేరకు ఏర్పాట్లు చేస్తాం.
– డాక్టర్ అప్పలనాయుడు,
సూపరింటెండెంట్,
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
పొరుగు జిల్లాలో కోవిడ్ కేసుల నమోదు
జిల్లాలో ఎటువంటి సన్నాహాలు చేయని వైనం
నిర్ధారణ పరీక్షలకు ఏర్పాట్లు లేవు..
కోవిడ్ లక్షణాలు ఉన్న వారు వస్తే పరిస్థితి ఏమిటన్న సందేహాలు