
దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జా
నెల్లిమర్ల రూరల్:
మండలంలో గుషిణి గ్రామంలో కోట్లాది రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో సాగుభూములుగా మారుతున్నాయి. ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామానికి చెందిన కొంతమంది కూటమి పార్టీ సానుభూతిపరులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని దర్జాగా సాగుచేసుకుంటున్నా అధికారులు కిమ్మనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కబ్జాల బాగోతంపై పలుమార్లు ఆధారాలతో ఫిర్యాదుచేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన కనిగిరి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమించడమే కాకుండా ఆ స్థలాల్లో బోర్లు కూడా ఏర్పాటు చేసి వాల్టా చట్టానికి కూడా తూట్లు పొడిచారని చెబుతున్నారు.
ప్రభుత్వ భూములకు విద్యుత్ కనెక్షన్లు ఎలా?
గుషిణి రెవెన్యూ పరిధిలోని 79/2లో శ్మశాన వాటిక, సర్వే నంబర్ 80/1లో సింహాద్రి చెరువు, సర్వే నంబర్ 65/15లో ప్రభుత్వ భూములను అదే గ్రామానికి చెందిన చందక రమణ, సూర్యారావు, సూరప్పలనాయుడు, తదితరులు ఆక్రమించుకున్నట్టు శ్రీనివాసరావు ఇటీవల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం కాకుండా నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ కనెక్షన్లు కూడా పొందారు. ప్రభుత్వ భూముల్లో బోర్లు వేసి దర్జాగా సాగుచేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములకు విద్యుత్ కనెక్షన్లను సంబంధిత అధికారులు ఎలా ఇచ్చార నేది ప్రశ్నార్ధకంగా మారింది.
గుషిణి రెవెన్యూ పరిధిలో ఆక్రమణలో ఉన్న సింహాద్రి చెరువు
హెచ్చరిక బోర్డులను తొలగించి మరీ...
చర్యలు తీసుకుంటాం...
గుషిణిలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై తహసీల్దార్ సుదర్శనరావు ఆధ్వర్యంలో గతంలో సర్వే చేయించారు. ఆక్రమణలు, అక్రమంగా బోర్లు ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్లు మంజూరు వంటివి గుర్తించారు. ఆక్రమిత స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. ఆ బోర్డులను తొలగించినట్లు మా దృష్టికి వచ్చింది. మరోసారి పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– రవి శంకర్, ఇన్చార్జి తహసీల్దార్, నెల్లిమర్ల
ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి
గుషిణిలో కూటమి పార్టీ సానుభూతిపరులు కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. శ్మశానవాటిక భూమిని కూడా వదల్లేదు. ఆక్రమిత స్థలాల్లో అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు పొంది బోర్లు కూడా ఏర్పాటు చేసుకొని దర్జాగా అనుభవిస్తున్నారు. ఆక్రమణలు అని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే వాటిని కూడా తొలగించారు. అసలు ప్రభుత్వ భూములకు విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారనే విషయంపై విద్యుత్ అధికారులు సమాధానం ఇవ్వాలి. సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూములను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవాలి. – కనిగిరి శ్రీను, జై భీమ్రావ్
భారత్ పార్టీ జిల్లా కార్యదర్శి
ప్రభుత్వ భూములకు అక్రమ విద్యుత్ కనెక్షన్లు
బోర్లు తవ్వి వాల్టా చట్టానికి తూట్లు
హెచ్చరిక బోర్డులు సైతం తీసేసి సాగుకు ఉపక్రమించిన అక్రమార్కులు
గుషిణిలో కూటమి సానుభూతిపరుల కబ్జాల పర్వం
చర్యలకు గ్రామస్తుల డిమాండ్
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదుతో తహసీల్దార్ సుదర్శనరావు రెవెన్యూ సిబ్బందితో ఆరునెలల కిందట సర్వే చేయించారు. సర్వే నంబర్ 65/15లో చందక సూరప్పనాయుడు, చందక సత్యం అనే వ్యక్తులు సాగు చేస్తున్న సుమారు 0.72 సెంట్లలో విస్తీర్ణంలో బంజరు భూమి ఆక్రమణకు గురైనట్లు, అక్రమంగా బోరును కూడా తవ్వినట్లు గుర్తించారు. సర్వే నంబర్ 65/30 లో మరో బోరు ఉన్నట్లు గుర్తించారు. సర్వే నంబర్ 79/2లో గెడ్డ పోరంబోకు భూమిలో ఉన్న శ్మశాన వాటికలో చందక రమణ, చందక సూర్యారావు వ్యక్తుల పేరిట సుమారు 0.10 సెంట్ల భూమి ఆక్రమణకు గురైనట్లు స్వయంగా రెవెన్యూ అధికారులే నిర్ధారించి ప్రకటించారు. ఆక్రమిత స్థలాల్లో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను సైతం సదరు ఆక్రమణదారులు తొలగించడం గమనార్హం.

దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జా

దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జా

దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జా

దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జా