
సాగునీటి కోసం.. రోడ్డెక్కిన రైతన్న
పాలకొండ: తోటపల్లి కాలువల ఆధునికీకరణ, కాలువల్లో పూడిక తీత, శివారు ప్రాంతాలకు సాగునీరు అందించే విషయంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రైతులు రోడ్డెక్కారు. పలుమార్లు వినతులు అందించినా ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన తీవ్రతరం చేశారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కోటదుర్గమ్మ ఆలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ తోటపల్లి ఆధునికీకరణ పనులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. పాలకొండ, వీరఘట్టం, జియ్యమ్మవలస, బూర్జ మండలంలోని పలు గ్రామాలకు ఏటా సాగునీరు అందడం లేదని ఆరోపించారు. పెద్ద బుడ్డిడి వద్ద మరమ్మతులకు గురైన సైపూన్ను తక్షణమే బాగుచేయాలని కోరారు. సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాస్ మాట్లాడుతూ కాలువల్లో పూడికలు తొలగించి ఖరీఫ్కు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఏవోకు వినతిపత్రం అందజేశారు. గతంలో ఇచ్చిన వినతులపై తీసుకున్న చర్యలు వివరించాలని ఏఓను నిలదీశారు. ఈ సమయంలో అధికారులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. సీఐ ఎం చంద్రమౌళి, ఎస్సై ప్రయోగ మూర్తిలు అక్కడికి చేరుకుని అధికారులతో సంయుక్త సమావేశానికి ఏర్పాటుచేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు కండాపు ప్రసాదరావు, దావాల రమణారావు, ఇద్దుబోయిన సింహాద్రి, గంగుల శ్రీనివాసరావు, కారెపు చిట్టిబాబు, లోలుగు నారాయణరావు, పలు కార్మికసంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ.. అనంతరం ధర్నా

సాగునీటి కోసం.. రోడ్డెక్కిన రైతన్న