
రామనారాయణంలో యోగాంధ్ర
విజయనగరం:
పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. రామధనుస్సు ఆకృతిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్, జేసీ ఎస్.సేతుమాధవన్ సహా సుమారు 1500 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, పరిసర గ్రామాల ప్రజలు భక్తి ప్రపత్తులతో యోగాసనాలు వేశారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా గురువులు డా.ఆరిశెట్టి ఇందుమతి, ఆరి సుందరశివరావు సుమారు 45 నిముషాల పాటు యోగసనాలు వేయించారు. అనంతరం యోగాంధ్రలో పాల్గొన్నవారందరూ రామనారాయణం దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మంత్రి, కలెక్టర్, జేసీలను ఎన్సీఎస్ ట్రస్టు సభ్యులు సత్కరించారు. ఆరోగ్య పరిరక్షణకు మన పూర్వీకులు మనకిచ్చిన గొప్ప ఆస్తి యోగా అని మంత్రి పేర్కొన్నారు. వచ్చేనెలలో చింతపల్లి బీచ్, రామతీర్థం, తాటిపూడి రిజర్వాయర్ తదితర ప్రదేశాల్లోనూ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్సీఎస్ ట్రస్టు ప్రతినిధులు చంద్రకళ, రామనారాయణం మేనేజర్ శ్రీనివాసరావు, ఆయుష్ జిల్లా అధికారి డా.బి.వరప్రసాద్, యోగాంధ్ర ప్రత్యేక అధికారి ఎం.ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.
జూన్ 10న ఎస్.కోటలో...
విజయనగరం అర్బన్: ఉపాధి హామీ వేతనదారులతో జూన్ 10వ తేదీన యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎస్.కోటలో నిర్వహించనున్నట్టు జేసీ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. సుమారు 5 వేల మంది వేతనదారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై తన చాంబర్లో జేసీ శుక్రవారం సమీక్షించారు. ఐదు వేల మంది పాల్గొనేందుకు అనువైన ప్రాంగణాన్ని గుర్తించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి, డ్వామా పీడీ శారదాదేవీ, వ్యవసాయ శాఖ జేడీ రామారావు, డీఎస్డీఓ వెంకటేశ్వరరావు, డీఎల్డీఓ రోజారాణి, హౌసింగ్ పీడీ మురళీమోహన్, డీఈఓ మాణిక్యంనాయుడు, సెట్విజ్ సీఈఓ అల్లు సోమేశ్వరరావు, మెప్మా పీడీ చిట్టిరాజు, డీఎంహెచ్ఓ జీవనరాణి, జెడ్పీ సీఈఓ వెంకటరామన్, తదితరులు పాల్గొన్నారు.
రామధనుస్సు ఆకృతిలో 1500 మంది యోగాసనాల ప్రదర్శన
పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ అంబేడ్కర్, జేసీ సేతుమాధవన్

రామనారాయణంలో యోగాంధ్ర