
అక్షరమై మెరిసి...డిజిటల్ యుగంలో చిన్నారులు పుస్తకాల కంటే సెల్ఫోన్తోనే కాలక్షేపానికి సమయం కేటాయిస్తున్నారు. కానీ మహిరమ అందుకు విరుద్ధం. సాహిత్యాన్ని అభిరుచిగా మార్చుకుంది. పదమూడు సంవత్సరాల వయసులోనే నవల రాసి శభాష్ అనిపించుకుంది మహిరమ...
తొమ్మిది సంవత్సరాల వయసులోనే చిన్న చిన్న పద్యాలు, పాటలు రాయడం ప్రారంభించింది మహిరమ. పదో ఏట స్నేహితులతో కలిసి చిన్న కథ రాసింది. ఆ తరువాత దీనినే నవలగా రాయాలనుకుంది. నవలగా పూర్తిరూపంలోకి రావడానికి రెండేళ్లు పట్టింది. 500 పేజీల ఈ నవల పేరు...రూబీ బ్లూ స్ట్రీమ్ అండ్ ద బాండ్ ఆఫ్ ఫైర్.
సంగీతంలోనూ మహీరమ రాణిస్తోంది. ప్రస్తుతం కర్ణాటక సంగీతంలో ఫోర్త్ గ్రేడ్లో శిక్షణ తీసుకుంటోంది. హస్తకళలు, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్లోనూ విశేష ప్రతిభ కనబరుస్తోంది. ఫ్రెంచి కూడా నేర్చుకుంటోంది. హైదరాబాద్లో 9వ తరగతి చదువుతున్న చల్లా మహిరమ ‘రూబీ బ్లూస్ట్రీమ్ అండ్ ద స్కీమ్ ఆఫ్ టైమ్’ పేరుతో మరో పుస్తకానికి శ్రీకారం చుట్టింది.
అందరూ చదివేలా...
నేను రాసిన ఫాంటసీ నవల ‘రూబీ బ్లూ స్ట్రీమ్ అండ్ ద బాండ్ ఆఫ్ ఫైర్’ పిల్లలే కాదు అన్ని వయసుల వారూ చదివేలా రాశాను. ఫాంటసీ సబ్జెక్ట్పై ఆసక్తి ఉన్నవారికి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్రకృతితో ముడిపడి ఉన్న అంశాల ఆధారంగా నవల రాశాను. భూమి, నీరు, గాలి, అగ్ని...వీటితో మనిషి జీవితం ఎలా ముడిపడి ఉంటుందనే విషయం చుట్టూ నవల సాగుతుంది.
– చల్లా మహిరమ
(చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్లో సెంచరీ కొట్టాలంటే..)