
ఈదురు గాలులకు నేలకొరిగిన చెట్లు
వేపాడ: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం కురిసిన ఈదురగాలులతో కూడిన వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. చామలాపల్లి–దబ్బిరాజుపేట రోడ్డులో చామలాపల్లి పసలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో భారీ చెట్టు విరిగి రోడ్డుపై పడడంతో రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. ఈదురగాలులకు మామిడి పంటకు నష్టం వాటిల్లింది. చామలాపల్లిలో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. దబ్బిరాజపేట, చామలాపల్లి, కరకవలస, పోతుబందిపాలెం, వెంకయ్యపాలెం గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
పరిశ్రమల్లో రక్షణ పరికరాలు తప్పనిసరి
బొబ్బిలి: పరిశ్రమల్లో రక్షణ పరికరాలను విధిగా ఏర్పాటుచేయాలని డీఎస్పీ జి.భవ్యారెడ్డి సూచించారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్న చిన్న, పెద్ద పరిశ్రమలను సీఐ కె.సతీష్కుమార్తో కలిసి రక్షణ పరికరాల ఏర్పాటును గురువారం తనిఖీ చేశారు. సిబ్బంది సంఖ్య, వారికి తగ్గట్టుగా రక్షణ పరికరాలు ఉన్నా యా లేదా అన్న అంశాన్ని పరిశీలించి వివ రాలు నమోదుచేశారు. పరిశ్రమల్లో ఎటువంటి నష్టాలు సంభవించకుండా రక్షణ వ్యవస్థను పటిష్టపరచుకోవాలని పారిశ్రామిక వర్గాలకు సూచించారు.
పీఎస్హెచ్ఎం పోస్టుల మంజూరులో అన్యాయం
బొబ్బిలి: టీచర్ పోస్టుల మంజూరులో రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేనివిధంగా జిల్లాకు పీఎస్హెచ్ఎం పోస్టులను కేటాయించకుండా తీరని అన్యాయం చేశారని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వి.పైడిరాజు అన్నారు. బొబ్బిలిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎన్.శ్రీదేవి అధ్యక్షతన గురువారం నిర్వహించిన ఏపీటీఎఫ్ ప్రాంతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎస్హెచ్ఎం పోస్టులు కేటాయించకపోవడం వల్ల జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారన్నారు. తక్షణమే పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఎం.బలరాంనాయుడు, గౌరవాధ్యక్షుడు ఎం.వి.రమణ, ఉపాధ్యక్షులు సీహెచ్ రామారావు, గంట సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఈదురు గాలులకు నేలకొరిగిన చెట్లు

ఈదురు గాలులకు నేలకొరిగిన చెట్లు