మంత్రి ఇలాకాలో... | - | Sakshi
Sakshi News home page

మంత్రి ఇలాకాలో...

Jun 6 2025 12:49 AM | Updated on Jun 6 2025 12:49 AM

మంత్రి ఇలాకాలో...

మంత్రి ఇలాకాలో...

విజయనగరం ఫోర్ట్‌/బొండపల్లి:

జిల్లాలో రేషన్‌ డిపోల నుంచి బియ్యం పంపిణీ ప్రారంభమై ఐదు రోజులవుతోంది. అప్పుడే.. అక్రమార్కులు తమ పనిలో పడ్డారు. పేదలకు చేరాల్సిన రేషన్‌ బియ్యాన్ని పెద్ద ఎత్తున అక్రమ మార్గంలో తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. టన్నుల కొద్దీ బియ్యం తరలిస్తుండడం, అది కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రాతినిథ్యం వహించిన గజపతినగరం నియోజకవర్గంలోనే అధిక మొత్తంలో పేదల బియ్యంను విజిలెన్స్‌ అధికారులకు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. పేదల బియ్యం అక్రమ రవాణాకు గజపతినగరం అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బియ్యం పట్టుబడిన నాలుగు గ్రామాలు కూడా మంత్రి నియోజకవర్గంలోనివే కావడం గమనార్హం. ఒకటి మంత్రి శ్రీనివాస్‌ నిత్యావసర వస్తువులు పంపిణీ చేపట్టిన బొండపల్లి మండలం గొట్లాం గ్రామం కాగా, మరొకటి మంత్రి సొంత మండలం గంట్యాడ మండలం వసాది గ్రామం. మిగిలిన రెండు గ్రామాలు బొండపల్లి మండలంలోని కిండాం అగ్రహారం, కొండకిండాం. ఇక్కడ రెండు చోట్ల అధికారులు జరిపిన తనిఖీల్లో 360 బస్తాల బియ్యం పట్టుబడగా.. అందులో 106 బస్తాలు ఏకంగా సివిల్‌సప్లయి సరఫరా చేసే గోనెల్లోనే ఎంఎల్‌సీ పాయింట్‌ నుంచి నేరుగా తరలించినవి కావడం గమనార్హం. మిగిలినవి గోనెలు మార్చి కోళ్లఫారం బయట వ్యాన్‌లో రవాణాకు సిద్ధంగా ఉంచారు. వీటిని సివిల్‌ సప్లయి డీటీ కె.తిరుపతిరావుతో పాటు బొండపల్లి ఎస్‌ఐ యు.మహేష్‌ గురువారం సీజ్‌చేశారు. వాహనాలతో పాటు బియ్యంను ఎంఎల్‌సీ పాయింట్‌కు తరలించారు. 6ఏ కేసు నమోదు చేశారు. బియ్యం ఎక్కడ నుంచి వచ్చాయి? ఎవరు ఇక్కడ నిల్వచేశారు? బాధ్యులెవరు అన్న అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం సీజ్‌చేసిన బియ్యం 15 టన్నులకు పైబడి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రేషన్‌ దుకాణాలు ప్రారంభించిన ఐదు రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో బియ్యం పక్కదారి పట్టడంపై అధికారులు నివ్వెరపోతున్నారు. అయితే, కేసు నీరుగార్చేలా వారిపై రాజకీయ పార్టీ పెద్దల నుంచి ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం.

యువత ఉపాధికి గండికొట్టి..

ఎండీయూ వ్యవస్థతో వందలాది మంది యువతకు ఉపాధి కలిగింది. మరోవైపు ఇంటిద్దకే రేషన్‌ సరుకులు సరఫరా అయ్యేవి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవికావు. ఐదేళ్లుగా చక్కగా సాగుతున్న వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దుచేసింది. యువతకు ఉపాధిలేకుండా చేసి రేషన్‌కార్డు లభ్ధిదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. అధికార పార్టీ నాయకులు కుమ్మకై ్క పేదల బియ్యంను కొల్లగొట్టేందుకు ఎండీయూ వ్యవస్థను రద్దుచేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్‌ అధికారుల దాడుల్లో బియ్యం పెద్ద ఎత్తున పట్టుబడడం ఆరోపణలకు బలం చేకూరుతోంది.

అమాత్యా.. ఇప్పడు ఏమంటారు?

అక్రమాలను నిరోధించేందుకు రేషన్‌ షాపులను పునరుద్ధరించినట్టు చెప్పిన మంత్రి శ్రీనివాస్‌

ప్రారంభించిన నాలుగు రోజులకే పక్కదారి పట్టిన టన్నులకొద్దీ బియ్యం

అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన బాగోతం

గజపతినగరం నియోజకవర్గంలో

సాగుతున్న బియ్యం అక్రమ తరలింపు

‘ఎండీయూ వ్యవస్థలో ఆపరేటర్లు పేదలకు

పంపిణీ చేయాల్సిన బియ్యంను పక్కదారి పట్టిస్తున్నారు. దీనివల్ల పేదలకు నష్టం జరుగుతోంది. అక్రమాలను నిరోధించేందుకు ఎండీయూ వ్యవస్థను రద్దుచేసి రేషన్‌ డిపోల్లో నిత్యావసర సరుకుల సరఫరాను పునరుద్ధరిస్తున్నాం.’

– రేషన్‌ డిపోల్లో బియ్యం సరఫరా ప్రారంభ సమయంలో రాష్ట్ర సెర్ప్‌, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలు ఇవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement