
కూటమి ప్రభుత్వ తీరుపై నిరసన
విజయనగరం గంటస్తంభం: పని గంటల పెంపు, నైట్ షిఫ్ట్లో మహిళలతో పని చేయించేందుకు అనుగుణంగా కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై సీఐటీయూ నాయకులు నిరసన తెలిపారు. తక్షణమే లేబర్కోడ్స్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్, కార్యదర్శి అయిలాడ జగన్మోహనరావు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద ఆందోళన చేశారు. మోదీ అడుగుజాడల్లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం నడుస్తోందని, పని గంటలను 10 నుంచి 12 గంటలకు పెంచడం అంటే కార్మికుల శ్రమను మరింత దోపిడీ చేయడమేనన్నారు. మహిళా సాధికారత అని గొప్పగా చెప్పిన కూటమి ప్రభుత్వం నైట్ షిప్ట్లో పనిచేసేందుకు అనుమతివ్వడం విచారకరమన్నారు. మహిళా సాధికారతపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వివిధ సంస్థలు, శాఖల్లో పనిచేస్తున్న మహిళలందరికీ కనీస వేతనాలు అమలు చేయా లని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లేబర్ కోడ్స్ అమలు నిలిపివేయాలని, లేని పక్షంలో జూలై 9న కార్మికవర్గం పెద్ద ఎత్తున సమ్మెకు సిద్ధమవుతుందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు యు.ఎస్.రవికుమార్, బి.రమణ, పాపారావు, రాఘవ, సుధీర్, వాసు, వెంకటేష్, సురేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు.