
పోలీసులకు సవాల్గా మారిన చోరీ
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గురుదేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు ఇంట్లో జరిగిన భారీ చోరీ పోలీసులకు సవాల్గా మారింది. ఈ చోరీ మంగళవారం రాత్రి జరిగినప్పటికీ ఇప్పటి వరకు కనీసం ఎటువంటి జాడ దొరకకపోవడంతో పోలీసులు ముల్లగుల్లాలు పడుతున్నారు. చోరీ జరిగిన ప్రదేశాన్ని ఎస్పీ వకుల్జిందాల్ శుక్రవారం క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరు, ఎక్కడ నుంచి వచ్చారు, ఎలా వెళ్లిపోయారు.. ఎంతమేర చోరీకి గురైయింది తదితర అంశాలను బాధితుడు జగదీష్బాబును అడిగి తెలుసుకున్నారు. దొంగతనం జరిగిన పూజాగదిని పరిశీలిచారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసరావు, కొత్తవలస, ఎస్.కోట సీఐలు షణ్ముకరావు, వేచలపు నారాయణమూర్తి, లక్కవరపుకోట, వేపాడ ఎస్ఐలు నవీన్పడాల్, సుదర్శనరావు, ఎస్బీ, ఇంటిలిజెన్స్ అధికారులతో ట్రస్టు సమీపంలో గల ఒక గదిలో ప్రత్యేక సమావేశాన్ని ఎస్పీ ఏర్పాటుచేశారు. దర్యాప్తు తీరుపై పలు సూచనలిచ్చారు. అసలు ఎంత మేర బంగారు చోరీకి గురైయిందన్న విషయంపై ఎవరికీ స్పష్టత లేకపోవడం గమనార్హం. కేసులో నమోదు చేసిన అంశాలకు, వాస్తవంగా చోరీకి గురైన బంగారానికి పొంతన లేనట్టు సమాచారం. అనంతరం ఎస్పీ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ చోరీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, సాంకేతిక ఆధారాలతో త్వరలోనే దొంగలను పట్టుకుంటామన్నారు. దీనికోసం ప్రత్యేక బృందాలను నియమించామని చెప్పారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
మంగళపాలెం గురుదేవా ట్రస్టు చైర్మన్ ఇంటిని పరిశీలించిన ఎస్పీ
అన్నికోణాల్లో దర్యాప్తు